హైదరాబాద్- ఆంద్రప్రదేశ్ నరసాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అరెస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. శుక్రవారం మధ్యాహ్నం ఏపీ సీఐడీ పోలీసులు రఘురామ కృష్ణ రాజును హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని ఎంపీ రఘురామ ఇంటిపై ఒక్కసారిగా దాడి చేసిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ క్రైం ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్ శుక్రవారం రాత్రి అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుపై 124 ఐపీసీ-ఏ సెక్షన్ నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. అయితే ఆయనపై సీఆర్ పీసీ 50 సబ్ సెక్షన్ 2 ప్రకారం నోటీసులు జారీ చేసినట్లు సీఐడీ పోలీసులు చెబుతున్నారు. అంతే కాదు ఇతరులతో కలిసి కుట్ర చేశారని 120 బీ సెక్షన్, ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారని 124 ఏ సెక్షన్లు, ఇతరుల మధ్య విద్వేషాలు కలిగించేలా వ్యాఖ్యలు చేశారని 153 ఏ సెక్ష్లన్చే, ముఖ్యమంత్రి వైస్ జగన్ పై వ్యక్తిగత దూషణ చేశారని 505 సెక్షన్ క్రింత కేసులు నమోదు చేశారు. అంతే కాదు కులాల మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా, వారిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని రఘురామకృష్ణ రాజుపై అభియోగాలు మోపారు సీఐడీ పోలీసులు.
వార్తా పత్రికలు, న్యూస్ ఛానళ్లు, వ్యక్తులతో కలిసి జనం మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని పలు ఐపీసీ, సీఆర్పీసీ సెక్షన్ల కింద ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్లోని ఆయన నివాసంలో నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజును అరెస్టు చేసినట్లు సీఐడీ తెలిపారు. ఆంద్రప్రదేశ్ సీఐడీ ఏడీజీ పీవీ సునీల్ కుమార్ ఆదేశాల మేరకు ప్రాథమిక విచారణ నిర్వహించి ఎంపీ రఘురామను అరెస్టు చేసినట్లు సీఐడీ పేర్కొంది.మరోవైపు రఘురామ కృష్ణరాజు అరెస్టుపై శుక్రవారం రాత్రి ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనల ప్రకారం అరెస్ట్ జరగలేదని, రఘురామకు అనారోగ్య సమస్యలున్నాయని పిటిషన్లో రఘురామ తరఫు న్యాయవాదులు తెలిపారు. ఈ పిటిషన్పై హైకోర్టు ఈరోజు విచారణ జరిపే అవకాశం ఉంది. మొత్తానికి ఎంపీ రఘురామ కృష్ణరాజు అరెస్ట్ రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది