ఫిల్మ్ డెస్క్- తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి సినిమాతో టాలీవుడ్ ను హాలీవుడ్ కు పరిచయం చేశారాయన. అటువంటి దర్శక ధీరుడి డైరెక్షన్ లో వస్తున్న తాజా సినిమా ఆర్.ఆర్.ఆర్. ఈ క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ ను 2022 జనవరి 7న విడుదలకు సిధ్దం చేస్తున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా హీరో రాంచరణ్ లు హీరోలుగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం విడుదల అవబోతున్న ఈ పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలు నెకొన్నాయి. ఇదిగో ఇటువంటి సమయంలో రాజమౌళి నెక్ట్స్ మూవీపై అందరిలో ఆసక్తి నెలకొంది. ప్రిన్స్ మహేశ్ బాబుతో సినిమా చేయనుండటమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు.
ఆఫ్రికన్ అడ్వంచరస్ థ్రిల్లర్ ను కథాంశంతో మహేష్ బాబుతో సినిమాకు రెడీ అవుతున్నారు రాజమౌళి. ఈ సినిమాలో మహేశ్ బాబు స్పై గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రేజీ మూవీలో జేమ్స్ బాండ్ తరహాలోని గెటప్ తో మహేశ్ అలరించబోతున్నారట. ఈ సినిమాకు సంబందించి మరో క్రేజీ న్యూస్ ఫిల్మ్ నగర్ లో హల చల్ చేస్తోంది. ఈ సినిమా కోసం తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ను విలన్ గా కన్ఫర్మ్ చేశారన్న చర్చ జరుగుతోంది.
దర్శకుడు రాజమౌళి తన ప్రతీ సినిమాకీ పాన్ ఇండియా స్థాయిలోనే ఆలోచిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మహేశ్ బాబుతో చేయబోయే ఈ సినిమాకి తమిళ స్టార్ హీరోని విలన్ గా ఫిక్స్ చేస్తున్నారని అంటున్నారు. ఇక ఈ సినిమాలో ఇంకా మరి కొందరు ఇతర భాషలకు సంబంధించిన క్రేజీ నటుల్ని ఎంపిక చేయబోతున్నారట రాజమౌళి. ఆర్.ఆర్.ఆర్ సినిమా రిలీజ్ తరువాత ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడనున్నాయి.