అమరావతి- ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దయ్యాయి. సుప్రీం కోర్టు ఆగ్రహంతో ఏపీ ప్రభుత్వం టెన్త్, ఇంటర్ పరీక్షల విషయంలో వెనుకడుగు వేసింది. రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. కరోనా కారణంగా టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని చాలా రోజులుగా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. అటు విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా పరీక్షల విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. దేశంలో ఇప్పటికే 21 రాష్ట్రాలు టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేశాయి. ఐతే ఏపీ ప్రభుత్వం మాత్రం పరీక్షలు నిర్వహించేందుకు సమాయుత్తం అయ్యింది.
దీంతో పలువురు టెన్త్, ఇంటర్ పరీక్షలపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో పరీక్షలపై పలు మార్లు విచారించిన సుప్రీం కోర్టు ఈ రోజు గురువారం తుది విచారణ జరిపింది. కరోనా తగ్గుముఖం పట్టిన నేపధ్యంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీంతో సుప్రీం కోర్టు ఏపీ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పిల్ల ప్రాణాలకంటే పరీక్షలే ముఖ్యమా అని ప్రశ్నించింది. పరీక్షల సందర్బంగా ఒక్క విధ్యార్ధి చనిపోయినా ఒక్కొక్కరికి కోటి రూపాయలు చెల్లించాలని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో టెన్త్, ఇంటర్ పరీక్షల రద్దుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈమేరకు టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. టెన్త్, ఇంటర్ పరీక్షలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫలితాల కోసం హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. హైపవర్ కమిటీ నివేదిక తర్వాత మార్కులపై నిర్ణయం తీసుకుంటామని సురేష్ తెలిపారు. ఇతర బోర్డు పరీక్షలు రద్దుతో ఏపీ విద్యార్థులకు నష్టం జరగదని మంత్రి అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోగా పరీక్షల నిర్వహణ అసాధ్యమన్న ఆదిమూలపు సురేశ్.. జులై 31లోగా ఫలితాలు ప్రకటించడం సాధ్యంకాదని తేల్చి చెప్పారు.