బిజినెస్ డెస్క్- బ్యాంకులు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాయో ఎవ్వరికి తెలియదు. కరోనా కష్టకాలంలో బ్యాంకులు సైతం ప్రజలపై భారం వేస్తున్నాయి. అసలే ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న కస్టమర్లపై ప్రభుత్వ బ్యాంకింగ్ సంస్థ ఎస్ బీఐ చార్జీల మోత మోగిస్తోంది. భారతీయ స్టేట్ బ్యాంకు సర్వీస్ చార్జీలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎస్బీఐలో బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ కలిగిన వారిపై చార్జీల భారం పడబోతోంది. ఎస్బీఐ కొత్త సర్వీస్ చార్జీలు జూలై 1 నుంచి అమలులోకి వస్తాయి. ఏటీఎం క్యాష్ విత్ డ్రాయెల్స్, చెక్ బుక్, నగదు బదిలీ, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు సవరించిన కొత్త సర్వీస్ చార్జీలు వర్తిస్తాయని బ్యాంక్ పేర్కొంది. ఈ రకం బ్యాంక్ ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండాల్సిన పని లేదు.
ఇంకా ఉచితంగానే రూపే ఏటీఎం కార్డు లభిస్తుంది. ఎస్బీఐ కొత్త నిబంధనల ప్రకారం నెలలో నాలుగు ఉచిత క్యాష్ విత్ డ్రాయెల్స్ పరిమితి అయిపోయిన తర్వాత ఒక్కో లావాదేవీకి 15 రూపాయల చార్జీ పడుతుంది. దీనికి జీఎస్టీ అదనం. బ్యాంక్ బ్రాంచ్ లేదా ఏటీఎం రెండింటికీ ఇదే చార్జీలు వర్తిస్తాయని ఎస్బీఐ తెలిపింది. ఇక ఎస్బీఐ ఒక ఆర్థిక సంవత్సరంలో 10 చెక్ లీవ్స్ను ఉచితంగా అందిస్తుంది. వీటి తర్వాత 10 చెక్ లీవ్స్ కలిగిన చెక్ బుక్ కు 40 రూపాయల చార్జీ పడుతుంది. దీనికి మళ్లీ జీఎస్టీ అదనం. 25 చెక్ లీవ్స్ కలిగిన చెక్ బుక్ అయితే 75 రూపాయల చార్జీతో పాటు జీఎస్టీ చెల్లించాలి. 10 లీవ్స్ కలిగిన ఎమర్జెన్సీ చెక్ బుక్ కోసం అయితే 50 రూపాయల చార్జీతో పాటు అదనంగా జీఎస్టీ పడుతుంది. ఐతే సీనియర్ సిటిజన్స్కు కొత్త సర్వీస్ చార్జీలు, చెక్ బుక్ చార్జీలు వర్తించవని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.