నగరి అర్బన్- ఆర్కే రోజా.. ఈ పేరు తెలుగు ప్రజలకు బాగా సుపరిచితం. ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా, ఆ తరువాత, జబర్దస్త్ జడ్జ్ గా, ఎమ్మెల్యేగా బాగా పాపులర్ అయ్యారు రోజా. మరీ ముఖ్యంగా చెప్పాలంటే జబర్దస్త్ కామెడీ షోకు జడ్జ్ గా బాగా క్రేజ్ సంపాదించారు రోజా. ఇక పాలిటిక్స్ కు వచ్చే సరికి ప్రత్యర్ధులు రోజాను ఫైర్ బ్రాండ్ గా పిలుస్తారు. అవును రోజా మాట్లాడిందంటే అంతా గజగజ వణికిపోవాల్సిందే.
సినీ నటి కం బుల్లితెర జడ్జ్ కం పొలిటీషియన్ అయిన రోజా ఈ మధ్య కాలంలో క్రీడాకారిణిగా మారిపోయింది. ఇటీవల భర్త సెల్వమణితో కబడ్డీ ఆడి అందరిిన ఆశ్చర్యపరిచిన రోజా, తాజాగా వాలీబాల్ ఆడి సందడి చేసింది. వరుసగా క్రీడా ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటున్న రోజా, ప్రొఫెషనల్ ప్లేయర్ను తలపిస్తూ ఆటలు ఆడుతోంది. తాజాగా తన సోదరుడితో కలిసి కాసేపు సరదగా వాలీబాల్ ఆడింది రోజా.
తన సొంత నియోజకవర్గం నగరిలో రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడోత్సవాలను ఎమ్మెల్యే రోజా ప్రారంభించింది. తన సోదరుడు రాంప్రసాద్ తో కలసి శుక్రవారం వడమాలపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వాలీబాల్ పోటీలను ఆరంభించారు. ఆ తరువాత విద్యార్థులతో కలిసి రోజా వాలీబాల్ ఆడి సందడి చేసింది. రోజా చారిటబుల్ ట్రస్ట్ కమిటీ సభ్యులు, వాలీబాల్ స్పోర్ట్స్ ఇంచార్జులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో సరదాగా సాగింది.
అన్నట్లు నవంబర్ 17న ఎమ్మెల్యే రోజా పుట్టిన రోజు. ఈ నేపధ్యంలోనే రోజా ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పలు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం నగరి డిగ్రీ కళాశాల గ్రౌండ్ లో స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేశారు. నవంబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరిగే ఈ స్పోర్ట్స్ మీట్ ను రోజా దంపతులు సోమవారం ప్రారంభించగా, వరుసగా వివిధ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో వీలును బట్టి రోజా సైతం ఆటలు ఆడటం విశేషం.