షాద్ నగర్- ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు బాగా పెరిగాయి. అతి వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ రోడ్డు ప్రమాదాలకు కారణంగా చెప్పవచ్చు. అందులోను వాహనాలకు నిప్పు అంటుకుని కాలిపోతున్న సంఘనలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలో ఇలాగే కారులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది.
రంగారెడ్డి జిల్లాలో కారుని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో కారు పొదల్లోకి దూసుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో నిండు గర్భిణి మృతి చెందింది. షాద్ నగర్ పరిధిలోని జాతీయ రహదారి బైపాస్పై నిన్న తెల్లవారుజామున ప్రమాదం జరిగింది.
హైదరాబాద్ నుంచి షాద్నగర్ వైపు వస్తున్న కారుని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో కారు రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. దీంతో కారు నుంచి పెట్రోల్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్దమైంది. ఈ ప్రమాదంలో శైలజ అనే నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
మంటల్లో కారు కాలిపోతుండగా, మంటలను ఆర్పేందుకు ఎంత ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. కారులో పెట్రోల్ ట్యాంక్ ఫుల్ ఉండటంతో, కారు పూర్తిగా కాలిపోయింది. మృతురాలు శైలజ భర్త సురేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.