అతి వేగం ప్రాణాలకు ప్రమాదం అన్న విషయం అధికారులు ఎంతగా చెప్పినా వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు పదుల సంఖ్యలో జరుగుతున్నాయి. డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యానికి ఎంతోమంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, అనుభవం లేకున్నా వాహనాలు నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అతివేగం ఓ యువతి నిండు ప్రాణాలు బలితీసుకుంది. ఈ విషాద ఘటన మాదాపూర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న స్వీటీ పాండే (22) ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. గురువారం తన స్నేహితుడు రాయన్ ల్యూకేతో కలిసి స్కూటీపై కుకట్ పల్లి నుంచి బయలుదేరింది. ఈ క్రమంలోనే రాయన్ స్కూటీని అతి వేగంగా నడిపించాడు. హైటెక్ సిటీ చౌరస్తా వద్ద ఉన్న ఫైఓవర్ వద్దకు రాగానే వాహనం అదుపుతప్పి ప్రొటెక్షన్ వాల్ ని బలంగా ఢీ కొట్టింది. దీంతో బైక్ పై వెనుక కూర్చున్న స్వీటీ పాండే గాల్లోకి ఎగిరి ఫ్లై ఓవర్ పై నుంచి పడిపోయి తీవ్రంగా గాయపడింది. వెంటనే ఇద్దరినీ దగ్గరలోని హాస్పత్రికి తరలించారు.
స్వీటీ పాండేకు తలకు బలంగా తాకడంతో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఆమె స్నేహితుడు రాయన్ కి కూడా గాయాలు అయి చికిత్స తీసుకుంటున్నాడు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫ్లై ఓవర్ పై అతివేగంగా రావడం.. అదుపు చేయలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.