రైల్వే ప్రమాదాల నివారణకు ఇండియన్ రైల్వేస్ పలు రకాల భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ఉంటుంది. ప్రయాణికుల రక్షణ కోసం కొన్ని రకాల సింబల్స్ ను ఏర్పాటు చేస్తుంది. వాటిల్లో 'X' గుర్తు ఒకటి. ఇది రైలు చివరి బోగీలో కనిపిస్తుంటుంది. కానీ వందే భారత్ లో మాత్రం ఉండకపోవడానికి కారణమేంటంటే?
దేశంలో రవాణా వ్యవస్థలో ఇండియన్ రైల్వే కీలకపాత్ర పోషిస్తుంది. నిత్యం వేలాది మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తూ ప్రజాధారణ పొందింది. సరుకు రవాణాలో కూడా భాగం పంచుకుంటూ వ్యాపార వాణిజ్యంలో తోడ్పాటునందిస్తుంది. ఈ క్రమంలో రైల్వే ప్రయాణికులకు అత్యుత్తమ సేవలందించేందుకు భారతీయ రైల్వే శాఖ శ్రీకారం చుట్టింది. దేశంలో హై స్పీడ్ రైళ్లను నడిపి ప్రయాణ సమయాన్ని తగ్గించి, సురక్షితంగా గమ్యస్దానాలకు ప్రయాణికులను చేరేవేసే విధంగా ఉండేందుకు వందే భారత్ పేరిట సెమీ హైస్పీడ్ ట్రైన్ లను ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా దేశంలోని పలు మార్గాల్లో వందే భారత్ ట్రైన్ లను ప్రారంభించింది. ఇదిలా ఉంటే ప్యాసింజర్ రైళ్లకు వాటి చివరి బోగీ వెనకాల ‘X’ గుర్తు ఉంటుంది. కానీ వందే భారత్ ట్రైన్ బోగీ వెనకాల ‘X’ గుర్తు ఉండదు? దీనికి గల కారణమేంటంటే..
భద్రతా ప్రమాణాల దృష్ట్యా, రైలు ప్రమాదాల నివారణలో భాగంగా ఇండియన్ రైల్వే పలు రకాల గుర్తులను, సిగ్నల్స్ ను రూపొందించింది. వాటిల్లో ‘X’ గుర్తుకు సంబంధించి మాట్లాడుకున్నట్లైతే.. ఈ గుర్తు రైలులోని చివరి బోగీని సూచిస్తుంది. రైలు ప్రయాణిస్తున్నప్పుడు స్టేషన్ లోని రైల్వే అధికారులు ఆ ‘X’ గుర్తు బోగీ ఆ రైలు చివరి బోగీ అని నిర్దారించుకుంటారు. ఒక వేళ ఈ ‘X’ గుర్తు ఉన్న బోగీ కనిపించకపోతే ఏదో ప్రమాదం జరిగిందని రైలు నుంచి బోగీలు విడిపోయాయని భావించి వెంటనే సంబందిత అధికారులకు సమాచారం అందిస్తారు. అందుకే ‘X’ గుర్తుకు రైల్వేలో ప్రాధాన్యత ఉంటుంది. కానీ వందే భారత్ లో మాత్రం ‘X’ గుర్తు కనిపించదు. ఎందుకంటే ఇది హైస్పీడ్ ట్రైన్ కాబట్టి అంతా అటాచ్డ్ గా ఉంటుంది. ఇది రెండు వైపుల నుంచి ప్రయాణిస్తుంది. ఈ కారణంచేతనే వందే భారత్ ట్రైన్ లో ‘X’ గుర్తు ఉండదు. అంతే కాకుండా వందే భారత్ లో రైల్వే సురక్షా కవచ్ అనే భద్రతా ఫీచర్ ఉంటుంది. ఈ ఫీచర్ రెండు రైళ్లు ఒకే ట్రాక్ లోకి వచ్చినప్పుడు ఢీకొనకుండా ప్రమాదాన్ని నివారిస్తుంది.