దేశంలో కట్నం తీసుకోవడం నేరం అని తెలిసినా కూడా.. కట్నం లేని పెళ్లిళ్ళు ఉండవంటే అందరికీ తెలిసిందే. కట్నం తీసుకొని కూడా కొంతమంది అదనపు కట్నం కావాలని ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్న ఘటనలు ప్రతిరోజూ ఎక్కడో అక్కడ వెలుగు చూస్తూనే ఉంటాయి.
భారత దేశంలో 1983లో ఐపీసీ సెక్షన్ 498-ఎ ప్రకారం వరకట్న వేధింపుల వ్యతిరేక చట్టాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టప్రకారం బాధితులు ఆధారాలతో ఫిర్యాదు చేస్తే.. భర్త, అతడి కుటుంబాన్ని వెంటనే అరెస్ట్ చేస్తారు. ఏ చట్టం ఉన్నా.. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఇంకా వరకట్న వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎంతోమంది ఆడపిల్లలు వరకట్న దాహానికి బలి అవుతూనే ఉన్నారు. వరకట్న దురాశతో ఓ వరుడు చేసిన పనికి వధువు కుటుంబం పరువు పోవడమే కాదు.. తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఫతేమాబాద్ రోడ్డులోని ప్రియాంషు గార్డెన్ లో బుధవారం ధోలిఖార్ మాంటోలా పెద్ద కూతురు గౌరీ వివాహం అమన్ తో జరిగింది. కుటుంబ ఆచారాల ప్రకారం నూతన వధువుని అత్తగారింటికి పంపించారు. అదే మండపంలో గురువారం చిన్న కూతురు డాలీ వివాహం ఆసిఫ్ తో జరిగింది. పెళ్లైన తర్వాత ఆసిఫ్ కుటుంబ సభ్యులు అదనపు కట్నంగా కారు కావాలని పట్టుబట్టారు. అకస్మాత్తుగా కారు డిమాండ్ చేయడంతో పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు. ఎంత బ్రతిమలాడినా పెళ్లికొడుకు అస్సలు పట్టించుకోలేదు.
చిన్న కూతురుకి లక్షల రూపంలో కట్నంగా సమర్పించుకున్నా.. వరుడూ అతని కుటుంబ సభ్యులు మరింత కట్నంగా కారు కావాలని డిమాండ్ చేయడంతో పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. పెళ్లికొడుకును ఒప్పించాలని ఎంతగానో ప్రయత్నించారు. అంతలోనే నవ వధువుకు ట్రిపుల్ తలాక్ చెప్పి వరుడు పెళ్లి మండపం నుంచి వెళ్లిపోయాడు. వరుడు చేసిన పనికి వధువు కుటుంబం తీవ్ర కలత చెందింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వరుడు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశామని.. ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ తెలిపారు.