రెండు నెలల క్రితం వరకు టమాటా కేవలం రూ.20 నుంచి రూ.30 వరకు మాత్రమే పలికింది. గత నెల నుంచి టమాటా ధరలకు రెక్కలు వచ్చాయి.. ఏకంగా కిలో 150 నుంచి 200 రూపాల వరకు పెరిగిపోయింది. దీంతో ప్రజలు టమాటాలు కొనాలంటే భయపడిపోతున్నారు. దాని బదులు రెండు మూడు రకాల కూరగాయాలు వస్తాయని అంటున్నారు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా టమాటాలకు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కిలో రూ.150 నుంచి రూ.200 వరకు పలుకుతుంది. టమాటా తోటలో దొంగలు పడి దోచుకువెళ్తున్న పరిస్థితి.. అంతేకాదు పంటకు కాపలాగా ఉన్న రైతును చంపి టమాటాలు దోచుకు వెళ్లిన ఘటనలు కూడా జరిగాయి. మధ్య తరగతి ప్రజలు మార్కెట్ కి వచ్చి టొమాటాలు కొనాలంటేనే బెంబేలెత్తిపోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇటీవల ఉత్తర భారతదేశంలో విపరీతమైన వర్షాలు కురియడంతో టమాట పంట తీవ్రంగా దెబ్బతింది. దీంతో టమాటాలకు దిగుబడి తక్కువ కావడంతో డిమాండ్ పెరిగిపోయింది. అదే రీతిలో రేట్లు కూడా ఆకాశాన్ని అంటాయి. కొన్నిచోట్ల చికెన్ కన్నా కిలో టమాటా ధరనే ఎక్కువ ఉందని అంటున్నారు. ప్రస్తుతం వర్షాకాల సీజన్ కావడం వల్ల మరో రెండు నెలల వరకు టమాట ధర ఇలానే ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. తాజాగా ఈ సీజన్ లో టొమాటో అమ్మి ఓ రైతే ఏకంగా రూ.2.81 కోట్లు సంపాదించాడు. వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్ర పూనే సమీపంలోని పాచ్ గర్ కి చెందిన రైతు దంపతులు తాము సంపాదించిన టొమాటోలు అమ్మ ఏకంగా కోట్లు సంపాదించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా టోమాటో ధరలు పెరిగిపోవడం ఈ సీజన్ లో తమకు బాగా కలిసి వచ్చిందని ఈ రైతు దంపతులు అంటున్నారు. ఈ ఒక్క సీజన్ లోనే టొమాటోలు అమ్మి రూ.2.81 కోట్లు సంపాదించామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇష్వార్ గైకర్, సొనాలి గైకర్ దంపతులకు 18 ఎకరాల పొలం ఉంది. అందులో 12 ఎకరాల్లో టమాటాను పండిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక లెక్క ఈ ఏడాది మరో లెక్క అన్నట్టు ఈ సీజన్ ఈ దంపతులకు బాగా కలిసి వచ్చింది. సొనాలి గైకర్ మాట్లాడుతూ.. ‘మొదట్లో ఈ పొలానికి మేం రూ.35 లక్షల పెట్టుబడి పెట్టాం.. అప్పుడు అది చాలా రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఎందుకంటే మేం పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందా? రాదా? అన్న విషయం తెలియదు. మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఈ సీజన్ మాత్రం అనూహ్యంగా టమాటా ధర పెరిగిపోవడంతో మాకు బాగా కలిసి వచ్చింది’ అని సంతోషం వ్యక్తం చేశారు.
ఇక టమాటా రైతు ఇష్వార్ గైకర్ మాట్లాడుతూ.. ‘12 ఎకరాల్లో టమాటా పంట వేయడం చాలా రిస్క్ తో కూడుకున్న పని.. ఈ విషయంలో నా భార్య సొనాలి నాకు ఎంతో ధైర్యం ఇస్తూ.. అండగా నిలిచింది. మేనేజ్ మెంట్ మొత్తం ఆమెనే చూసుకునేది.. పొలంలో కూలీలను ఎంత మంది పెట్టాలి.. వారిలో ఎంతమంది పొలంలో పనిచేయాలి.. ఎంతమంది టమాటాలను శుభ్రం చేయాలి అనే విషయం మొత్తం ఆమెను చూసుకునేది. మా దగ్గర సుమారు 70 నుంచి 80 మంది వరకు కూలీలు ఉంటారు. నేను పంట వేయడం.. దాన్ని అమ్మడం వరకు చూసుకునేవాడిని.. టామాల చేతికి రావాలంటే శారీరక శ్రమ మాత్రమే కాదు.. వాతావరణం కూడా సరిగా ఉండాలి. ఈ భూమిలో టమాటా బాగానే పండుతుంది.. దానికి సస్యరక్షణ చేయాలి. చెట్ల మధ్య గ్యాప్ సరిగా ఉండేలా చూసుకోవాలి… వాటికి పురుగు పట్టకుండా కాపాడుకోవాలి. ఈ ఏడాది నాకు మంచి దిగుబడి వచ్చింది.
మేం సాధారణంగా ఏప్రిల్ లో పంట నాటుతాం.. మే నెలలో టెంపరేచర్ బాగా పెరిగిపోతుంది.. అప్పుడు పంటను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అయితే ఇక్కడ వాతావరణం మాకు ఓ వరం లాంటిది. మా గ్రామాన్ని జున్నార్ జిల్లా మారిషన్ అని పిలుస్తారు. ఇక్కడ సహజ వాతావరణం మాకు అనుకూలంగా ఉంటుంది. మే నెలలో 20 కేజీల టమాటా సుమారు 60 నుంచి 70 రూపాయలు పలికేవి.. తర్వాత ధరలు అమాంతం పెరిగిపోయాయి. 20 కేజీల కార్టన్ ఇప్పుడు 2700 రూపాలు పలుకుతుంది. టమాటా ధరలు ఇంత గరిష్టానికి చేరుకోవడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది టమాటా రైతులు అదృష్టం చేసుకున్నారని చెప్పాలి. అయితే వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారన్న విషయం తెలుసు.. కానీ రైతులకు కొన్ని సీజన్లు మాత్రమే ఇలా కలిసి వస్తుందని అర్ధం చేసుకోవాలని కోరుకుంటున్నా’ అని అన్నారు ఇష్వార్ గైకర్.