కరోనా కారణంగా గతంలో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ఏం చేయాలో తెలియక కేంద్ర ప్రభుత్వం పూర్తి లాక్ డౌన్ విధించింది. దీంతో అటు సాఫ్ట్ వేర్ ఉద్యోగి నుంచి తాపీ పని చేసే కూలీ వరకూ అందరూ ఇళ్లకు పరిమితమయ్యారు. ఇక ఈ నేపథ్యంలో నిత్యవసర సరుకుల విషయంలో సామాన్యులకు ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయని భావించి మోడీ సర్కార్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనలో భాగంగా ఉచిత రేషన్ అందించే కార్యక్రమాన్ని అమలు చేసింది. దీంతో దేశ వ్యాప్తంగా 80కోట్ల మంది లబ్ధిపొందినట్టు ప్రభుత్వం వర్గాలు అప్పట్లో వెల్లడించాయి.
అయితే పరిస్థితులు అనుకూలించి కరోనా కేసులు కూడా పూర్తిగా తగ్గిపోవటంతో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను ఎత్తివేసింది. ఇక కరోనా సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ కూడా పుంజుకుంది. దీంతో ఉచిత రేషన్ ప్రతిపాదనపై కేంద్రం ఎలాంటి సూచనలు చేయలేదని ఆహార, ప్రజాపంపిణీ విభాగం కార్యదర్శి సుదర్శన్ పాండే వెల్లడించారు. దీంతో ఈ నెల 30 నుంచి ఉచిత రేషన్ ను కొనసాగించలేమని, ఇక దీని కారణంగా ఉచిత రేషన్ నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో సామాన్యులకు కాస్త షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.