ఆమె ఊహించి ఉండదూ తనపై కామాంధులు విరుచుకుపడతారని, ఓ గౌరవమైన వృత్తిలో ఉన్న వ్యక్తి తన పట్ల మావన మృగమౌతాడని. ఊరు వెళదామని రైలు ఎక్కిన ఆ మహిళపై ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ), మరో వ్యక్తి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది. జనవరి 16న సుబేదార్ గంజ్ ఎక్స్ప్రెస్లో ఈ దారుణం జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. 33 ఏళ్ల మహిళ తన రెండేళ్ల కుమారుడితో కలిసి డెహ్రడూన్ ప్రయాగరాజ్ లింక్ ఎక్స్ ప్రెస్ కోసం జనవరి 16 రాత్రి రైల్వే స్టేషన్ లో ఎదురు చూస్తున్నారు. జనరల్ కోచ్ ఎక్కిన తర్వాత.. అక్కడకు వచ్చిన టీటీఈ రాజు సింగ్ .. బాబుతో ప్రయాణం కష్టమని చెప్పి, ఏసీ కోచ్ లో కూర్చొమని చెప్పాడు. సరేనని, ఆమె, కుమారుడితో కలిసి ఏసీ కోచ్ లోకి వెళ్లింది. కొద్ది సేపటి తర్వాత టీటీఈ, మరొక వ్యక్తి ఆ కోచ్ లోకి వచ్చి తినడానికి ఏమైనా కావాలని అడగ్గా.. ఆమె నిరాకరించింది.
తర్వాత ఆమెకు తాగేందుకు టీటీఈ నీళ్లు ఇవ్వగా.. వాటిని తాగింది. కొద్ది సేపటికే కళ్లు తిరిగిపడిపోయానని, ఆ తర్వాత వారిద్దరూ తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని మహిళ తమకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గాఢ నిద్రలో ఉన్న తన కుమారుడ్ని కూడా వేరొక బెర్త్ లోకి మార్చారని, తాను అరిచేందుకు ప్రయత్నించినప్పటికీ.. మత్తు ప్రభావం వల్ల తన గొంతు పెగలలేదని ఆమె పేర్కొన్నట్లు చెప్పారు. ఇంటికి చేరుకున్న మహిళ.. తన భర్తకు ఈ విషయాన్ని చెప్పగా.. రైల్వే హెల్ప్ లైన్ నంబర్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో టీటీఈ, అతడి సహచరుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీటీఈ రాజు సింగ్ ను రైల్వే అధికారులు సస్పెండ్ చేసి, అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసిజర్స్ కింద కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే పోలీసులు తెలిపారు.