ప్రస్తుత కాలంలో చదువనేది అత్యంత ఖరీదైన విషయంగా మారిపోయింది. పెరిగుతున్న నిత్యావసర ధరలతో పాటు, ప్రైవేటు స్కూళ్లల్లోనూ ఇష్టారాజ్యంగా పెరుగుతున్న ఫీజులతో సామాన్యుడు అతలాకుతలం అవుతున్నాడు. ఓవైపు ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని తల్లిదండ్రులకు అధికారులు ఎంతగా అర్ధమయ్యేలా చెబుతున్నా.. చాలా మంది ప్రైవేట్ స్కూల్స్ వైపే మొగ్గు చూపిస్తున్నారు. తలకు మించిన భారం అయినా అప్పులు చేసి మరీ తమ పిల్లలను చదివిస్తున్నారు.
ఇక రోడ్డు పక్కన బిక్షాటన చేసే వారి పిల్లల చదువు పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తల్లిదండ్రులకు విద్యపట్ల సరైన అవగాహన లేక వారి పిల్లలను చిన్నప్పటి నుంచే యాచకులుగా మారుస్తున్నారు. మరికొంత మంది ఇతర పనులకు పంపుతున్నారు. ఇలాంటి నిరుపేద పిల్లలకు తనవంతు సహాయం చేయాలని భావించారు ఓ పోలీస్ ఆఫీసర్. మంచి విద్యాబోధన చేసి వారికి ఉజ్వల భవిష్యత్ అందించేందుకు కృషి చేసేందుకు పూనుకున్నాడు.
రంజీత్ యాదవ్ అనే సబ్ ఇన్స్ పెక్టర్ వీధుల్లో బిక్షాటన చేసుకునే వారి పిల్లల కోసం ఒక పాఠశాల ఏర్పాటు చేసి స్వయంగా తానే బోధిస్తున్నాడు. సమయం దొరికినపుడు పిల్లలకు పాఠాలు చెబుతూ వారికి చక్కటి విద్యనందిస్తున్నారు. తమకు చదువుకోవాలన్న ఆశ ఉన్నా.. పరిస్థితుల కారణంగా చదవలేని పేద విద్యార్థులను చేరదీసి వారికి విద్యాబుద్దులు నేర్పిస్తున్నారు. అంతేకాదు బిక్షాటన చేస్తున్న తల్లిదండ్రులను కలిసి వారి పిల్లలను పాఠశాలకు పంపాలని అవగాహ కల్పిస్తున్నారు.
ఇక తమ చదువు గురించి అక్కడ పిల్లలు మాట్లాడుతూ.. పోలీస్ సార్ చాలా చక్కగా తమకు పాఠాలు చెబుతారని.. అందుకే తామంతా ఇక్కడికి రావడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తున్నామని అన్నారు. మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి చదువుతో పాటు ఇతర విషయాలు కూడా తెలుస్తున్నాయని తమ భవిష్యత్ గురించి ఇంత శ్రద్ద తీసుకుంటున్న పోలీస్ సార్ కి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ అధికార హోదాలో ఉన్నా.. పిల్లలకు మంచి చేయాలనుకుంటున్న పోలీస్ ఆఫీసర్ పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్న్యూస్! చేతిలో చిల్లిగవ్వ లేకున్నా పర్లేదు..