ఆర్టీసీ బస్సుల్లో టిక్కెట్లు కోసం కొన్ని సార్లు చిల్లర లేక ఇబ్బంది పడుతుంటాం. రూ.10, 15 టిక్కెట్కు అందరూ రూ. 100, రూ.500 నోట్లు ఇస్తే చిల్లర ఎక్కడి నుంచి తేవాలి అంటూ కండక్టర్లు విసుక్కోవడం.. దిగేటప్పుడూ తీసుకోండి అంటూ టిక్కెట్టు వెనుక రాసి ఇస్తే.. కొన్ని సార్లు మనం దాన్ని మర్చిపోయి డబ్బులు పోగొట్టుకోవడం జరుగుతున్నాయి. అందుకే బస్సుల్లో ‘టిక్కెట్లుకు సరిపడా చిల్లర ఇచ్చి కండక్టరుకు సహకరించగలరు’ అనే లైన్స్ రాసి ఉంటాయి.
ఈ చిల్లర సమస్యను తీర్చేందుకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ పేమేంట్స్ను ప్రవేశ పెట్టనుంది. అందుకోసం స్వైపింగ్ మెషీన్లు, స్కానర్లను అందుబాటులోకి తీసుకురానుంది. డెబిట్కార్డు, ఫోన్ యూపీఐ ద్వారా పేమెంట్లు చేసుకునేందుకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేపట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం బస్సుల్లో టికెట్లు ఇచ్చేందుకు టిమ్స్ ను ఉపయోగిస్తున్నారు. వీటి స్థానంలో అధికారులు ఈ- పాస్ యంత్రాలను తీసుకురానున్నారు. డెబిట్, క్రెడిట్ కార్డులు, ఫోన్పే, గూగుల్పే, పేటీఎం వంటి వాటి ద్వారా చెల్లించేలా వెసులుబాటు కల్పించనున్నారు.
అంతేకాకుండా ఆర్టీసీ వ్యాలెట్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని అందులో మనీ డిపాజిట్ చేసుకుంటే టికెట్ను సులభంగా పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు బస్సు కండక్టర్లకు అవగాహన కల్పిస్తున్నారు. మార్గమధ్యలో సర్వీసు ఆగిపోతే వేరే బస్సులోకి ప్రయాణికులను పంపించడానికి బ్రేక్డౌన్ ఆప్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆఫ్లైన్లో టికెట్ అందజేసే విధంగా ఈ -పాస్ యంత్రాన్ని రూపొందించారు. దీని ద్వారా సిగ్నల్ లేని ప్రాంతాల్లోనూ సులభంగా టికెట్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది.
బస్ పాస్ను ఈ -పాస్ మెషీన్తో స్కాన్ చేసిన వెంటనే వివరాలు వస్తాయి. దీంతో ఎంతమంది పాస్ ద్వారా, టికెట్ ద్వారా ప్రయాణిస్తున్నారని సులువుగా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలోని కొన్ని ప్రధాన పట్టణాల్లో ప్రయోగత్మాకంగా టికెట్లను జారీచేస్తున్న అధికారులు.. త్వరలో అన్ని బస్సుల్లో యంత్రాలు అందుబాటలోకి తీసుకువస్తామని చెబుతున్నారు. మరి ఏపీఎస్ ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.