వేగవంతమైన ట్రైన్లను నడపాలనే ఉద్దేశ్యంతో ఇండియన్ రైల్వే వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకు వచ్చింది. దానిలో భాగంగా పలు మార్గాల్లో ట్రైన్లను ప్రారంభించింది. ఇప్పుడు మరిన్ని ట్రైన్లను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు 80 వందే భారత్ ట్రైన్లకు ఆర్డర్ ఇచ్చింది.
భారతీయ రైల్వే వ్యవస్థలో నిత్యం వేలాది మంది ప్రయాణిస్తూ తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. రవాణా వ్యవస్థలో ఇండియన్ రైల్వే కీలకపాత్ర పోషిస్తూ ప్రయాణికుల ఆధరణ పొందింది. ప్రయాణికులను, వస్తువులను ఒకప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చేరవేస్తూ వ్యాపార వాణిజ్యాల్లో తోడ్పాటునందిస్తుంది రైల్వే వ్యవస్థ. అయితే ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు, ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు వందే భారత్ పేరిట హై స్పీడ్ రైళ్లను అందుబాటులోకి తీసుకు వచ్చింది. కాగా ఈ రైళ్లను ఇప్పటి వరకు కొన్ని మాత్రమే నడుస్తున్నాయి. వాటి సంఖ్య పెంచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దానిలో భాగంగా 80 వందే భారత్ రైళ్లకు ఆర్డర్ ఇచ్చింది ఇండియన్ రైల్వే.
ఇప్పటికే దేశంలోని పలు మార్గాల్లో ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లు ప్రయాణాలు కొనసాగిస్తున్నాయి. ప్రజల అవసరాల దృష్ట్యా ఈ రైళ్ల సంఖ్య పెంచాలని భావించిన భారతీయ రైల్వే మరో 80 వందే భారత్ రైళ్ల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చింది. వేల కోట్లు విలువ చేసే ఈ కాంట్రాక్ట్ ను ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన సంస్థలు దక్కించుకున్నాయి. ప్రభుత్వ సంస్థ అయిన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, ప్రైవేట్ రంగానికి చెందిన వ్యాగన్ తయారీ కంపెనీ అయిన టిటాగర్ రైల్ సిస్టమ్స్ లిమిటెడ్ భాగ స్వామ్యంలోని కన్సార్టియం 80 వందే భారత్ రైళ్ల తయారీకి ఒప్పుకున్నాయి. ఈ ట్రైన్ల మొత్తానికి రూ. 24 వేల కోట్ల కాంట్రాక్ట్ ను ఇండియన్ రైల్వే ఆ సంస్థలకు అప్పగించింది.
ఈ కాంట్రాక్ట్ ను దక్కించుకున్నట్లు ఆ సంస్థలు ప్రకటించాయి. ట్రైన్ల తయారీ తో పాటు దాదాపు 35 ఏళ్ల పాటు వాటి నిర్వహణ కూడా ఆ సంస్థలే చూసుకోవాల్సి ఉంటుంది. రానున్న రెండెళ్లలో వందే భారత్ ట్రైన్ నమూనాను డెలివరీ చేయనున్నట్లు సంస్థ చైర్మన్ తెలిపారు. వందే భారత్ రైలు గరిష్ఠ వేగం 160 నుంచి 180 కి.మీ వేగంతో ప్రయాణించగలదు. 16 కోచ్ లతో 887 మంది ప్రయాణించే విధంగా రూపొందించనున్నారు. గత సంవత్సరం తొలి వందే భారత్ రైలు ఢిల్లీ- వారణాసి మధ్య ప్రారంభించారు. ఈ ఏడాది జనవరిలో సికింద్రాబాద్- విజయవాడ మధ్య వందే భారత్ ట్రైన్ ను ప్రారంభించారు. దేశంలో స్పీడు రైళ్లను నడపాలనే ఆలోచనతో ఇండియన్ రైల్వే ఈ వందే భారత్ ట్రైన్లకు శ్రీకారం చుట్టింది.