ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన ఘోర విషాదంలో కొందరు చిల్లర వ్యక్తులు చేతివాటం ప్రదర్శించారు. చేతికి చిక్కిన వస్తువులను వదలకుండా పట్టుకెళ్లిపోయారు. విషాదంలోనూ కొందరు చేతివాటం ప్రదర్శించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దేశ రైల్వే చరిత్రలోనే అత్యంత ఘోర రైలు ప్రమాదాల్లో ఒకటిగా చెబుతున్న ఒడిశా ట్రైన్ యాక్సిడెంట్ మృతుల సంఖ్య 288కి చేరింది. ఈ ఘోర ప్రమాదంలో గాయపడిన వారి సంఖ్య 1,175 అని తెలిసింది. గాయపడిన వారిలో 793 మందిని డాక్టర్లు డిశ్చార్జ్ చేసి పంపారని సమాచారం. అయితే, కోరమాండల్ ఎక్స్ప్రెస్, హౌరా ఎక్స్ప్రెస్ ట్రైన్స్లో ప్రయాణించిన వారిలో పలువురి ఆచూకీ ఇప్పటికీ దొరకడం లేదు. వందకు పైగా ప్యాసింజర్లు ఏమైపోయారోననేది తెలియడం లేదు. ఇదిలా ఉండగా.. బాలాసోర్లో జరిగిన ఈ ఘోర విషాద సమయంలోనూ కొందరు చిల్లర వ్యక్తులు చేతివాటం ప్రదర్శించారు. పట్టాల మీద పడిపోయిన పర్సులు వెతుకుతూ వాటిలో ఉన్న డబ్బుల్ని తీసుకున్నారు. మరికొందరైతే పట్టాల నిండా పడి ఉన్న కొత్త బట్టలు, ఇతర విలువైన వస్తువుల్ని ఏరుకుని తీసుకెళ్లారు.
విషాదంలోనూ చిల్లర వ్యక్తుల చేతివాటంపై సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. వీళ్లు అసలు మనుషులేనా? ఇంత ఘోర విషాదంలో చేతివాటం ఏంట్రా బాబు అని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. సాటి మనుషులు చనిపోయిన, గాయాలపాలైన వేళ.. చేతికి చిక్కిన వస్తువులను వదలకుండా తీసుకెళ్తున్న వీరు మనుషులు కాదని నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. ఇకపోతే, రైలు ప్రమాద ఘటనా స్థలిలో ప్రయాణికుల వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయాయి. తెగిపోయిన చెప్పులు, చిరిగిపోయిన బట్టలు, ఆధార్కార్డులు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, బ్యాగులు, పర్సులు పట్టాల నిండా కనిపిస్తున్నాయి. పట్టాలపై పడి ఉన్న వస్తువులను బట్టి విషాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అలాగే పట్టాలు తప్పింది రైలు మాత్రమే కాదు.. కొన్ని వందల కుటుంబాలు అని ఆ వస్తువులను సజీవ సాక్ష్యాలుగా చెప్పొచ్చు.