ఒడిశాలో కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదాన్ని మరువక ముందే మరో విషాదం చోటుచేసుకుంది.అదే రాష్ట్రంలో జరిగిన ఒక ప్రమాదంలో రైలు కిందపడి ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
ఒడిశా రైలు ప్రమాద వార్తను దేశ ప్రజలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఘోర విషాదంలో వందలాది మంది మృతి చెందడం, వేలాది మంది గాయాలపాలవ్వడం తెలిసిందే. ఇండియన్ రైల్వేస్ హిస్టరీలో ఘోర విషాదాల్లో ఒకటిగా దీన్ని చెబుతున్నారు. బాలాసోర్లో జరిగిన ఈ ప్రమాదాన్ని ప్రజలు అంత త్వరగా మర్చిపోరనే చెప్పాలి. ఈ ఘటనపై రైల్వే ఉన్నతాధికారుల దర్యాప్తు పూర్తయిందని తెలుస్తోంది. రైలు భద్రతలో కీలకంగా భావించే ఇంటర్లాకింగ్ వ్యవస్థలో మార్పులు చేయడం వల్లే ఈ ఘోర యాక్సిడెంట్ జరిగిందని రైల్వే అధికారులు అంటున్నారు. అయితే ఎవరు దీనికి పాల్పడ్డారు? ఎందుకిలా చేశారు? కుట్ర పన్ని ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ విషాదంలో నిజానిజాల నిగ్గు తేల్చేందుకు సీబీఐ రంగంలోకి దిగింది.
సీబీఐ విచారణ పూర్తయితే గానీ ప్రమాదానికి అసలు కారణం, బాధ్యులు ఎవరనేది బయటకు రాదు. అలాగే బాధ్యులపై రైల్వే శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇదిలా ఉంటే.. ఒడిశాలో మరో విషాదం చోటుచేసుకుంది. ఝాజ్పూర్ రైల్వే స్టేషన్లో గూడ్స్ బోగీల చక్రాల కిందపడి ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. గత కొంతకాలంగా ఇంజిన్ లేని గూడ్స్ రైలును ఇక్కడ ఉంచారు. అయితే భారీ వర్షం రావడంతో కార్మికులు ఆ గూడ్స్ ట్రైన్ కింద తలదాచుకున్నారు. అదే సమయంలో ఒక్కసారిగా భారీ ఈదురుగాలులు రావడంతో గూడ్స్ బోగీలు ముందుకు కదిలాయి. దీంతో గూడ్స్ చక్రాల కిందపడి ఆరుగురు చనిపోగా, మరో ముగ్గురికి గాయాలవ్వడంతో వీరిని కటక్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.