సాధారణంగా మన సమాజంలో దంపతుల్లో ఒకరు మరణించినప్పుడు.. విడాకులు తీసుకున్న సందర్భాల్లో రెండో వివాహం చేసుకుంటారు. అయితే ఒకరికి తెలియకుండా మరొకరిని వరుస పెట్టి పెళ్లి చేసుకునే ప్రబుద్ధులు కూడా ఉంటారు లెండి. కానీ ఇక్కడ ఓ వ్యక్తి మాత్రం మొదటి భార్య బతికుండానే రెండో వివాహం చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. అది కూడా సీక్రెట్ గా కాదు. బ్యానర్లు కట్టించి మరి ప్రకటించాడు. తాను రెండో వివాహం చేసుకోవాలని భావిస్తున్నానని.. ఆసక్తి ఉన్న మహిళలు ఎవరైనా సరే తనను సంప్రదించవచ్చని.. వారికి పిల్లలు ఉన్నా పర్లేదు అని ప్రకటించాడు. ఎందుకంటే.. ఎన్నికల్లో పోటీ చేయడం కోసమట. అసలు ఎన్నికలకు, ఈ రెండో వివాహానికి మధ్య గల సంబంధం గురించి తెలియాలంటే.. ఇది చదవాల్సిందే.
మహారాష్ట్రలో ఈ సంఘటన చోటు చేసుకుంది. త్వరలో ఔరంగాబాద్ మున్సిపల్ ఎన్నికలు రానున్నాయి. ఈ క్రమంలో రమేశ్ పాటిల్ అనే వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయాలని భావించాడు. అయితే అతడికి ముగ్గురు పిల్లలు ఉండటం వల్ల ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోయాడు. అయినా సరే ఎలాగైనా బరిలో నిలవాల్సిందే అని గట్టి పట్టుదలతో ఉన్నాడు రమేశ్. ఈ క్రమంలో అతడికి ఓ ఆలోచన వచ్చింది. తన బదులు తన కుటుంబంలో నుంచి ఎవరో ఒకరిని పోటీలో నిలపాలని భావించాడు. అయితే తల్లిదండ్రులు, తోడబుట్టిన వారిని కాకుండా.. భార్య అయితే బాగుంటుందని భావించాడు.
అయితే మొదటి భార్యకు ముగ్గురు సంతానం ఉండటంతో.. ఆమె పోటీకి అనర్హురాలు కనుక.. రెండో వివాహం చేసుకుని.. ఆమెను ఎన్నికల బరిలో నిలపాలని భావించాడు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు రెండో భార్య కావాలంటూ ప్రకటన ఇచ్చాడు. బ్యానర్లు ముద్రించి ఔరంగాబాద్ నగరం అంతా వాటిని కట్టించాడు. తనకు కాబోయే భార్య ఎలా ఉండాలో దీనిలో పేర్కొన్నాడు. వివాహిత అయినా పర్లేదు కానీ.. ఆమెకు ఇద్దరు సంతానం మాత్రమే ఉండాలనే కండిషన్ పెట్టాడు. ఆసక్తి ఉన్న వారు తనను సంప్రదించాల్సిందిగా కోరుతూ.. ఫోన్ నంబర్ ఇచ్చాడు రమేశ్.
ప్రస్తుతం ఔరంగాబాద్ వాసులు ప్రకటన గురించే చర్చించుకుంటున్నారు. ఇప్పటి వరకు తాము పలు కారణాల వల్ల రెండో వివాహం చేసుకున్నవారిని చూశామని.. కానీ ఎన్నికల కోసం రెండో పెళ్లికి సిద్ధపడ్డ వ్యక్తిని చూడటం ఇదే ప్రథమం అంటున్నారు. రమేశ్ పాటిల్ ఆలోచనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.