మన దేశంలో మద్యం సేవించేవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉంది. కొన్ని రాష్ట్రాలకు మద్యం విక్రయాలు ప్రధాన ఆదాయ వనరులు అంటుంటారు.
దేశంలో మద్యం తాగేవారు చాలా మందే ఉన్నారు.. కొంతమందికి మద్యం లేనిదే పూట గడవదు. ఒక్కసారి మద్యం అలవాటు అయితే.. మానేయడం చాలా కష్టం అని అంటుంటారు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని సీసాలపై రాసినా.. ఏమాత్రం పట్టించుకోకుండా సీసాలు సీసాలే తాగేస్తుంటారు. కొంతమందికి మందు లేనిదే ముద్దదిగదు అంటారు. ఇక మద్యం సేవించడానికి ముందు ఎలా ఉన్నా.. మద్యం సేవించిన తర్వాత మందుబాబులు ఎలా ఉంటారో, వారి ప్రవర్తన ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. పండుగలు, శుభకార్యాలు ఏవైనా మందు పార్టీ లేనిదే అస్సలు మజా రాదంటారు. ఉదయం మందు వైన్స్ షాప్ ఓపెన్ కావడమే ఆలస్యం మందుబాబులు క్యూ కడుతుంటారు. తాజాగా మద్యం బాబులకు చేదు వార్త.. రాబోయే పండుగల కోసం ప్రభుత్వం 4 డ్రై డేలను ప్రకటించింది.
భారత దేశంలో పలు రాష్ట్రాల్లో ప్రధానమైన పండుగలకు జాతీయ సెలవులు ప్రకటిస్తుంటారు. ఆ సమయంలో మద్యం షాపులను మూసివేస్తుంటారు. దేశంలో చాలా రాష్ట్రాలకు మద్యం అమ్మకాల వల్ల మంచి ఆదాయం సమకూరుతుందన్న విషయం తెలిసిందే. అందుకే కొన్ని రాష్ట్రాల్లో మద్యం షాపులు, బార్లు తెరిచి ఉంచడానికి సమయ వేళలు వేరుగా ఉంటాయి. అయితే డ్రై డేగా పిలిచే విధానంలో మద్యం షాపులు మూసివేస్తారు. దేశ రాజధాని ఢిల్లీలో రాబోయే పండుగల కోసం నాలుగు డ్రై డేలను ప్రకటించింది కేజ్రీవాల్ ప్రభుత్వం. జులై 29న మొహ్రం, ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం, సెప్టెంబర్ 7న జన్మాష్టమి, సెప్టెంబర్ 28 న ఈద్-ఎ- మిలాద్ తేదీల్లో మద్యం షాపులు మూసివేయబడతాయి ఢిల్లీ సర్కార్ తెలిపింది.
సాధారణంగా దేశంలో ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సెలవు ఉంటుంది.. ఆరోజు మద్యం షాపులు మూసివేయబడతాయి. ఈ నిబంధన ఎప్పటి నుంచో ఉంది. రాష్ట్రంలో జరిగే ముఖ్య పండుగల సందర్బంగా మద్యం దుకాణాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు తమ తరుపు నిర్ణయం తీసుకోవచ్చు. ఈ క్రమంలోనే పలు రాష్ట్ర ప్రభుత్వాలు పండుగలు పురస్కరించుకొని మద్యం దుకాణాలు మూసి వేస్తుంటారు. నాలుగు ప్రత్యేక రోజుల్లో మద్యం షాపులు మూసి ఉంచాలని ఎక్సైజ్ శాఖ ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు పంపగా వాటికి సీఎం కేజ్రీవాల్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ క్రమంలోనే మూడు నెలలకోసారి ఢిల్లీ ప్రభుత్వం డ్రై డే జాబితాను విడుదల చేస్తుంది. ఎన్నికలు, ప్రత్యేక సందర్భాల్లో డ్రై డేల సంఖ్య పెరగవొచ్చని ఎక్సైజ్ అధికారి తెలిపారు.