సాధారణంగా భారత దేశంలో హిందూ ప్రధాన దేవాలయాల్లో ఏనుగులు దర్శనం ఇస్తుంటాయి. ఏనుగు అంబారీ మీద స్వామి వారి ఊరేగింపు కనుల పండువగా ఉంటుంది.. కానీ ఈ మద్య కొన్ని చోట్ల ఏనుగులు చేస్తున్న బీభత్సవం వల్ల భక్తులు భయాందోళన చెందుతున్నారు.
పూర్వ కాలం నుంచి హిందూ ప్రధాన దేవాలయాల్లో ఏనుగులు దర్శనం ఇస్తుంటాయి. స్వామి వారి ఉత్సవాల్లో ఏనుగు ఊరేగింపు ప్రత్యక ఆకర్షణగా నిలుస్తుంది. దైవ దర్శనానికి వచ్చిన భక్తులను ఎనుగులు తొండంతో ఆశీర్వదించడం చూస్తూనే ఉంటాం. తాజాగా త్రిసూర్ లోని శ్రీకృష్ణ ఆలయంలో రోబో ఏనుగు దర్శనం ఇస్తుంది.. ఇది అచ్చం నిజమైన ఏనుగులా కనిపించడమే కాదు.. చెవులు ఊపుతూ.. భక్తులను ఆశీర్వదిస్తుంది. వివరాల్లోకి వెళితే…
సాధారణంగా పెద్ద పెద్ద ఆలయాల్లో ఉత్సవాలు జరిగినపుడు ఏనుగులపై దేవదేవులను ఊరేగించడం సాంప్రదాయంగా వస్తుంది. అలాగే ప్రత్యేకంగా ఆద్యాత్మిక కార్యక్రమాలు జరిగినా స్వామివారిని ఏనుగులపై ఊరేగించడం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా తమిళనాడు, కేరళాలో పలు ఆలయాల్లో ఎక్కువగా ఏనుగులు దర్శనం ఇస్తుంటాయి. దేవాలయ కమిటీ ఈ ఏనుగులను ప్రత్యేకంగా పెంచుతుంటారు. ఇటీవల ఈ ఏనుగులు విచిత్రంగా ప్రవర్తించడం.. అంబారీ కట్టిన తర్వాత ఒక్కసారిగా ఘీంకారాలు చేస్తూ భక్తులపై దూసుకు వెళ్తు నానా బీభత్సం చేస్తున్నాయి. ఆ సమయంలో చాలా మంది గాయపడటం.. కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతున్నాయి. సరైన సంరక్షణ ఇవ్వడం లేదని.. హింసలకు గురి అవుతున్నకారణంతోనే ఇలా జరుగుతున్నాయని కొంతమంది ఆరోపిస్తున్నారు.
ఇలాంటి సంఘటనలు ఏవీ తమ ఆలయంలో జరగకూడదని భావించిన ఓ వినూత్న ప్రయోగానికి సిద్దమయ్యారు. త్రిసూర్ లోని శ్రీకృష్ణ ఆలయంలో రోబోటిక్ ఏనుగును తీసుకు వచ్చారు. ఇది చూడటానికి అచ్చం నిజమైన ఏనుగులాగే ఉంటుంది.. అంతేకాదు తల, తోక, చెవులను ఊపడంతోపాటు భక్తులకు ఆశీర్వాదాలు సైతం అందించడం విశేషం. త్రినూర్ లోని ఇరింజలకుడ శ్రీకృష్ణ దేవాలయంలో జరిగిన నదయిరుతాల్ ఉత్సవ వేడుకల్లో ఈ రోబోటిక్ ఎనుగును వినియోగిస్తున్నారు. భగవంతుని సేవలో ఏనుగు పాల్గొనడం చూసి భక్తులు కూడా విచిత్రమైన అనుభూతి పొందుతున్నారు.
కేరళాలో మొదటిసారిగా శ్రీకృష్ణ దేవాలయంలో స్వామివారి సేవా పనులకు రోబోటిక్ ఏనుగును వినియోగించడం ఇదే తొలిసారి. ఈ ఏనుగుకి ‘ఇరింజదపల్లి రామన్’ అని నామకరణం చేశారు. దీని బరువు 800 కిలోలు.. జంతు హక్కుల ఉద్యమం సంస్థ ‘పెటా’ చెందిన కొంతమంది ఈ రోబోటిక్ ఏనుగును బహుకరించినట్లు సమాచారం. ఆలయ వంశపారంపర్య అర్చకుడు రాజ్ కుమార్ నంబూద్రి మాట్లాడుతూ.. ఇటీవల ఏనుగులను పోషించడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.. అయినా కొన్నిసార్లు ఏనుగుల ప్రవర్తన వల్ల భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోబోటిక్ ఏనుగు ఒక వినూత్న ప్రయోగం అని భావిస్తున్నాని అన్నారు.