అదొక బస్తీ. ఆ బస్తీలో అనేక మంది చిన్న చిన్న రేకుల షెడ్లు వేసుకుని జీవనం సాగిస్తుంటారు. వారికీ ఎక్కడా ఇళ్ళు లేక సంవత్సరాలుగా అక్కడే నివాసం ఉంటున్నారు. అలాంటి సమయంలో ఎవడో డబ్బున్నవాడు షాపింగ్ కాంప్లెక్స్ కడతానని, వాళ్లకి వేరే చోట ఇళ్ళు కట్టిస్తానని చెప్తాడు. కొంతమంది నమ్మరు. నమ్మకపోతే పోలీసులతో కొట్టించి ఖాళీ చేయించే పరిస్థితి. అప్పుడు హీరో పోలీసుల అన్యాయాన్ని ఎదుర్కొంటాడు. ఈ కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి. ఇంకొన్ని కథలు ఉంటాయి. చిన్నప్పుడు తన కుటుంబానికి అన్యాయం జరిగిందని, ఎదిగిన తర్వాత ప్రతీకారం తీర్చుకుంటాడు హీరో. ఇంకొన్ని కథల్లో హీరో బాగా చదువుకుని అత్యున్నతమైన అధికారంతో విలన్ల భరతం పడతాడు. ఇవన్నీ సినిమాలు, కల్పిత కథలు.
నిజ జీవితంలో ఇలాంటి రివేంజ్ స్టోరీలు జరుగుతాయా? అని మనం అనుకుంటాం. కానీ సినిమాని తలపించే రియల్ రివేంజ్ స్టోరీలు కూడా ఉంటాయి. పెద్ద పెద్ద ప్రభుత్వ స్థలాలని కబ్జా చేస్తే ఏమీ చేయలేని ఈ పోలీసులు.. రోడ్డు పక్కన తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసే అమాయకుల మీద తమ ప్రతాపం చూపిస్తుంటారు. వాళ్ళని కొట్టి అక్కడ నుంచి తరిమేస్తుంటారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే కమలేష్ అనే యువకుడి జీవితంలో చోటు చేసుకుంది. నాలుగేళ్ల వయసులో కళ్ళ ముందు తండ్రిని పోలీసులు అన్యాయంగా కొడుతుంటే ఆ కుర్రాడు తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా ఈ అన్యాయాన్ని ఎదిరించాలని అనుకున్నాడు. దీని కోసం కష్టపడి చదివి ఏకంగా జడ్జి అయిపోయాడు.
అది 1992వ సంవత్సరం. బీహార్ లోని మారుమూలన ఉండే సహర్సా అనే గ్రామంలో చంద్రశేఖర్ యాదవ్ అనే ఒక పేదవాడు ఉన్నాడు. బతుకు తెరువు దేశ రాజధాని ఢిల్లీకి వలస వెళ్ళాడు. కుటుంబంతో కలిసి ఎర్రకోట వెనకాల ఉన్న గుడిసెలో ఉండేవాడు. పొట్ట కూటి కోసం ఒక తోపుడు బండి మీద స్నాక్ ఐటమ్స్ అమ్ముతూ జీవనం సాగించేవాడు. తండ్రికి నాలుగేళ్ల కుమారుడు కమలేష్ కూడా చేదోడువాదోడుగా ఉండేవాడు. అయితే ఒక పోలీస్ అధికారి వచ్చి అతని తండ్రిని చెంప దెబ్బ కొట్టి తోపుడు బండిని తొలగించాలని చెప్పాడు. ఆ సమయంలో కమలేష్ కి ఆ పోలీస్ ని కొట్టాలన్నంత కోపం వచ్చిందట. ఆ పోలీసోడ్ని వెనక్కి నెట్టాలని అనుకున్నాడట. కానీ తానేమీ చేయలేనని రియలైజ్ అయ్యాడు.
అయితే అప్పుడే లాయర్ అవ్వాలని అనుకున్నాడు. లాయర్ అయితే న్యాయం కోసం వాదించవచ్చు అని అనుకున్నాడు. ఒకసారి తన తండ్రి తనను కొట్టిన పోలీస్ ఆఫీసర్ మీద కోర్టులో కేసు వేశాడు. ఆ సమయంలో జడ్జి ఆ పోలీస్ కి చుక్కలు చూపించాడు. అప్పుడు కమలేష్ తండ్రి.. ‘చూసావా, ఆ జడ్జి ఆ పోలీసోడికి ఎలా చెమటలు పట్టించాడో. అదే అధికారానికి ఉన్న పవర్’ అని చెప్పాడు. దీంతో లాయర్ అవుదామనుకున్న కమలేష్.. ఆ ఒక్క ఇన్సిడెంట్ తో జడ్జి అవ్వాలని ఫిక్స్ అయ్యాడు. తన తండ్రికి జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకూడదంటే జడ్జి అవ్వాలని అనుకున్నాడు. అన్యాయాన్ని ఎదిరించాలంటే జడ్జి అవ్వడమే సరైనదని నిర్ణయించుకున్నాడు. ఎలాగైనా కష్టపడి చదివి జడ్జి అవ్వాలని నిర్ణయించుకున్నాడు.
పేదరికాన్ని సైతం లెక్కచేయకుండా కష్టపడి చదివాడు. 2017లో బీహార్ లో న్యాయమూర్తుల నియామకం కోసం నిర్వహించిన జ్యుడిషియల్ సర్వీస్ పరీక్షలు రాశాడు. కరోనా కారణంగా 3 సంవత్సరాలు వృధా అయ్యింది. కానీ కమలేష్ నిరుత్సాహపడలేదు. మరోసారి ప్రయత్నించి బీహార్ జ్యుడిషియల్ సర్వీస్ ఎగ్జామ్స్ లో 64వ ర్యాంక్ సాధించి జడ్జిగా ఎంపికయ్యాడు. ఈయన జడ్జి అవ్వడం తమకెంతో గర్వంగా ఉందని సహస్రా ప్రజలు అంటున్నారు. ఏ పోలీస్ ఐతే తన తండ్రిని కొట్టాడో.. అదే పోలీస్ ఇప్పుడు కమలేష్ ఎదురైతే సెల్యూట్ కొట్టాల్సిందే. అదే జడ్జికి ఉన్న పవర్. పోలీస్ చేతిలో దెబ్బ తిన్న తండ్రి పగని.. జడ్జి అయ్యి పోలీసులు సైతం సెల్యూట్ చేసేలా కమలేష్ ఎదిగిన తీరు ఎంతో ఆదర్శనీయం. బస్తీ నుంచి కోర్టులో న్యాయం చెప్పే న్యాయవాది స్థాయికి ఎదగడం అంటే మామూలు విషయం కాదు.