భారత ప్రధాని మోదీ జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ పథకం ఇన్స్పిరేషన్తో హైడ్రోజన్ ప్యూయల్ బస్సును రూపొందించారు. దీంతో పర్యావరణ కాలుష్యం తగ్గడమే కాకుండా నిర్వహణ కూడా సులువుగా ఉంటుందని నిపుణుల అభిప్రాయం.
ఈ రోజుల్లో పెట్రోల్, డీజిల్ ఇంధనంగా వాహనాలకు విరివిగా వాడుతున్నారు. ఈ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయ ఫ్యూయల్ తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఎలక్ట్రికల్ వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. మరో అడుగు ముందుకు వేస్తూ హైడ్రోజన్తో నడిచే వాహనాలకు కూడా పెద్దపీట వేస్తున్నారు. హైడ్రోజన్తో నడిచే బస్సులు లేహ్ రోడ్లపై పరుగులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో పనిచేసేలా ఈ బస్సులను రూపొందించారు. ట్రయల్ రన్ కు సిద్ధంగా ఉన్నాయి. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. .
హైడ్రోజన్ ఇంధనంతో నడిచే బస్సు మన దేశంలోనే మొదటిసారిగా లేహ్ రోడ్లపై పరుగులకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన ట్రయల్ రన్ను నేషనల్ థర్మల్ పవర్ కార్మొరేషన్ చేపట్టింది. లడఖ్ దేశంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతం. ఇక్కడ ఎన్టీపీసీ హైడ్రోజన్ ఫ్యూయలింగ్ స్టేషన్, సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తుంది. తాజాగా హైడ్రోజన్ ఇంధనంతో నడిచే 5 బస్సులను లేహ్ అధికారులకు అందజేసింది. మూడు నెలల పాటు ట్రయల్స్, ఇతర ప్రక్రియలు నిర్వహించనున్నారు. దీనికోసం ఆగస్టు 17న బస్సులు లేహ్కు వచ్చేశాయి.
ఎన్టీపీసీ.. 11,562 అడుగుల ఎత్తులో గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీ ప్రాజెక్ట్లో భాగంగా 1.7 మెగావాట్ల సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేసింది. దీనికోసం లేహ్లో 7.5 ఎకరాల స్థలాన్ని లీజుకు తీసుకుంది. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో పనిచేసేలా బస్సులను రూపొందించారు. 2032 నాటికి 60 గిగావాట్ల పునరుత్పాదక ఫ్యూయల్ కెపాసిటీ సాధించడమే ఎన్టీపీసీ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో రెండు ఘనతలు సాధించింది ఎన్టీపీసీ. మొదటిసారిగా ప్రజా రవాణలో హైడ్రోజన్ ఫ్యూయల్ బస్సుల వాడకం, 11,500 అడుగుల ఎత్తులో ఆక్సిజన్ తక్కువగా ఉన్న ప్రాంతంలో సాంకేతికతను టెస్ట్ చేయడం. ఆగస్టు 15 రోజున వీటిని ప్రారంభించాలని భావించారు. కానీ వరదలు, కొండచరియలు విరిగిపడడం వంటి పరిణామాల వల్ల ప్రారంభించలేకపోయారు.
2020లోనే స్వతంత్ర దినోత్సవ ప్రసంగంలో కార్బన్-న్యూట్రల్ లడఖ్ గురించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. మోదీ మాట్లాడుతూ.. ‘హిమాలయాల్లో ఉన్న లడఖ్ చాలా ప్రత్యేకతలను కలిగి ఉంది. వాటిని మనం సంరక్షిస్తూ.. పెంచుకోవాలి. సిక్కిం సేంద్రీయ రాష్ట్రంగా ముద్ర వేసింది. ఈశాన్య ప్రాంతంలో లడఖ్, లేహ్, కార్గిల్ ప్రాంతాలు కూడా ‘కార్బన్ న్యూట్రల్’ యూనిట్గా సముచిత స్థానాన్ని సృష్టించుకోగలవు’ అని అన్నారు.