మరి కొన్ని రోజుల్లో ఆ కుటుంబంలో పెళ్లి బాజాలు మోగాల్సి ఉంది. మూడు రోజుల క్రితమే ఆ ఇంటి ఆడపడుచుకు వివాహం నిశ్చయమయ్యింది. ఆదివారం నిశ్చితార్థం వేడుక జరిగింది. బంధుమిత్రలుతో ఇళ్లంతా కోలాహలంగా ఉంది. పెళ్లికి నెల రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో.. పనులు ఎలా ప్రారంభించాలి.. ఏర్పాట్లు వంటి వాటి గురించి చర్చించుకుంటున్నారు. ఇంతలో కొందరు సాయంత్రం అలా సరదాగా బయటకు వెళ్లి వద్దాం అన్నారు. కానీ అప్పుడు వారికి తెలియదు.. ఆ సరదా తమ ప్రాణాలు తీస్తుందని. సుమారు 35 మంది వరకు రెడీ అయ్యి.. నగరంలో ఎంతో ప్రఖ్యాతి గాంచిన కేబుల్ బ్రిడ్జి చూడటానికి వెళ్లారు.
అప్పటికే దాని మీద వందలాది మంది ఉన్నారు. వారితో పాటు.. ఆ కుటుంబ సభ్యులు కేబుల్ బ్రిడ్జి మీదకు చేరుకుని నది అందాలను ఆస్వాదిస్తూ ఉండగా ఉన్నట్లుండి బ్రిడ్జి కుప్పకూలింది. వంద మందికి పైగా మృతి చెందారు. వారిలో ఆ కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందగా.. వారిలో నవ వధువు కూడా ఉంది. మరికొన్ని రోజుల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో.. ఇంత మంది మృతి చెండటంతో.. విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ వివరాలు..
ఆదివారం గుజరాత్లోని మోర్బీ తీగల వంతెన కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్కు చెందిన మెహబూబ్ బాయి మీరా అనే వ్యక్తి కుటుంబానికి చెందిన ఆరుగురు కేబుల్ బ్రిడ్జి ప్రమాదంలో మృతి చెందారు. వీరిలో మెహబూబ్ కుమార్తె, ఇద్దరు తోబుట్టువులు, ఇద్దరు మేడకోడల్లు, మేనల్లుడు ఉన్నాడు. వీరిలో ఓ సోదరికి అదే రోజు నిశ్చితార్థం జరిగింది.
ఆ వేడుకకు వచ్చిన బంధుమిత్రులంతా.. కేబుల్ బ్రిడ్జి చూడ్డానికి వెళ్లారు. ఇక మీరా, అతడి భార్య మాత్రం.. సోదరి పెళ్లికి కావాల్సిన బంగారు ఆభరణాలు కోనుగోలు చేయడం కోసం బజారుకు వెళ్లడంతో వారు ఈ ప్రమాదం నుంచి బయట పడగలిగారు. ఇక మృతి చెందిన వారిలో నవ వధువుతో పాటు 3 సంవత్సరాల చిన్నారి కూడా ఉంది.
మరి కొన్ని రోజుల్లో పెళ్లి బాజా మోగాల్సిన ఇంట్లో.. ఒకేసారి ఇంత మంది మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఇక మెహబూబ్ను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తన కుటుంబ సభ్యులు మృతి చెందారని.. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. బ్రిడ్జి వద్ద ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేవని.. పోలీసు కాదు కదా.. కనీసం ఒక్క సెక్యూరిటీ గార్డు కూడా లేడని తెలిపాడు. ఇక ప్రమాదం జరిగిన తర్వాత కూడా అధికారులు వెంటనే రియాక్ట్ కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కేబుల్ బ్రిడ్జి ఘటనలో సుమారు 135 మంది మృతి చెంది వారి కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చారు. వారిలో మెహబూబ్ లాంటి బాధితులు ఎందరో ఉన్నారు. ఎవరిని కదిలించిన కన్నీళ్లు.. తీరని ఆవేదన.