కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్ ని ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ పై ఇటు రాజకీయ పార్టీలు, అటు ప్రజలు పెదవి విరుస్తున్నారు. అసలు బడ్జెట్ లో కేంద్రం ఎవరికి ఏం కేటాయించిందో కూడా జనాలకు అర్థం కాలేదు. విశ్లేషకులు మాత్రం బడ్జెట్ లో చాలా వర్గాల వారికి ఊరట కలిగించే అంశాలున్నాయి అంటున్నారు. బడ్జెట్ అనగానే సామాన్యులు ఇంధన ధరలు పెరుగుతున్నాయా లేదా అన్న దాని గురించి ఆలోచిస్తారు. అయితే బడ్జెట్ లో పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా ప్రకటన వచ్చింది. ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి ఎక్సైజ్ సుంకాన్ని పెంచనుంది కేంద్ర ప్రభుత్వం. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇదే జరిగితే వాహనదారులపై మరింత భారం పడనుంది.
ఇథనాల్, బయోడీజిల్ మిశ్రమం లేకుండా విక్రయించే పెట్రోలియం ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించాలని బడ్జెట్ 2022 కేంద్రం ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో, 2022-23 బడ్జెట్లో నాన్-మిక్స్ ఇంధనాలపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీనివల్ల పెట్రోల్, డీజిల్ ధరలను పెరిగే అవకాశం ఉంది. సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో అక్టోబర్ 1, 2022 నుండి, కల్తీ లేని ఇంధనాలపై లీటరుకు రూ. 2 అదనపు ఎక్సైజ్ సుంకం విధిస్తామని ప్రకటించారు. అక్టోబర్ 1, 2022 నుంచి ఇది దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ఈ క్రమంలో ఎక్సైజ్ సుంకం విధిస్తే.. పెట్రోల్, డీజిల్ లీటర్ పై రూ. 2 పెరగనుంది.దీని వల్ల ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలలో పెట్రోలు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇథనాల్ లేదా బయోడీజిల్ మిశ్రమంతో కూడిన ఇంధనాల సరఫరా అక్కడ లేకపోవడమే దీనికి కారణం. దేశంలోని చాలా ప్రాంతాల్లో డీజిల్ను ఎలాంటి మిశ్రమం లేకుండా విక్రయిస్తున్నారు. ప్రస్తుతం చెరకు లేదా ఇతర ఆహార ధాన్యాల నుంచి తీసిన ఇథనాల్ను 10 శాతం నిష్పత్తిలో మాత్రమే పెట్రోల్లో కలుపుతున్నారు. చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, రైతులకు అదనపు ఆదాయ వనరులను అందించడానికి పెట్రోల్లో ఇథనాల్ కలపడం అనుమతించబడింది.