మిడిల్ క్లాస్ కుటుంబాలకు చెందిన తండ్రులు, తల్లులు.. తమ పిల్లలు తప్పు చేస్తే ఖచ్చితంగా వాళ్ళని కొట్టడమో, తిట్టడమో.. కనీసం మా పిల్లలు తప్పు చేశారు అని ఒప్పుకోవడమో చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు స్థానంలో నిజాయితీ ఉంది కాబట్టి. ఇదే పరిస్థితి ఒక ధనవంతుల ఇండ్లలో జరిగితే.. తమ పిల్లల్ని వెనకేసుకొస్తారు. మద్యానికి, డ్రగ్స్ బానిసై.. అమ్మాయిలని చెరిచి.. ఆరోపణలు, కేసులు ఉన్నా కూడా తమ కొడుకులు మంచివాళ్ళే అన్న దృష్టిలో ఉంటారు. బెయిల్ మీద బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తారు. చేసిన తండ్రులు కూడా ఉన్నారు. సినిమాల్లో చూసినట్టు కొడుకులు తప్పు చేస్తే.. తప్పుబట్టే తండ్రులు.. నిజ జీవితంలో ఉండరు అనుకుంటే అది మన తప్పే అవుతుంది.
కొడుకు చేసిన తప్పుని ఒప్పుకోవడమే కాకుండా.. తన కొడుకులా ఎవరూ తప్పు చేయవద్దు అని చెప్పే రాజకీయ నాయకుడు ఉన్నారు. డ్రగ్స్, మద్యం తాగుతూ ఉండే వాళ్ళ కంటే.. కాయకష్టం చేసుకుని బతికే ఒక మంచి మనిషికి ఇచ్చి మీ అమ్మాయికి పెళ్లి చేయండి అని ప్రజలను వేడుకునే రాజకీయ నాయకుడు ఉన్నారు. ఆయన మరెవరో కాదు.. ఉత్తరప్రదేశ్ కి చెందిన రాజకీయ నాయకుడు కౌశల్ కిషోర్. గృహ మరియు పట్టణ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న కౌశల్ కిషోర్.. మద్యానికి బానిసైన తన కొడుకు గురించి చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఉత్తరప్రదేశ్ లోని లంభువా అసెంబ్లీ నియోజకవర్గంలో మద్యం అలవాటు విముక్తిపై నిర్వహించిన డ్రైవ్ లో భాగంగా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మద్యం అలవాటు ఉన్న యువకులకు.. తల్లిదండ్రులు తమ ఆడపిల్లలను ఇచ్చి పెళ్లి చేయవద్దని ఆయన సూచించారు. ‘నేను ఒక ఎంపీగా, నా భార్య ఒక ఎమ్మెల్యేగా ఉండి.. మద్యానికి బానిసైన మా కొడుకు ప్రాణాలను కాపాడుకోలేకపోయాం. కిడ్నీ, లివర్ ఫెయిల్యూర్ కారణంగా రెండేళ్ల క్రితం మా కొడుకు మరణించాడు. అతని భార్య ఒంటరి అయ్యింది. ఇప్పుడు ఆమెకు తోడు లేరు. మీరు మీ అమ్మాయిలకి, అక్కాచెల్లెళ్లకు ఇటువంటి పరిస్థితి రానివ్వకండి’ అంటూ విజ్ఞప్తి చేశారు. పొగాకు, మద్యం, డ్రగ్స్ రహిత దేశంగా ఈ దేశాన్ని మార్చడమే తన లక్ష్యమని కౌశల్ అన్నారు. రాబోయే సంవత్సరం డ్రగ్ ఫ్రీ ఇయర్ గా సెలబ్రేట్ చేసుకోవాలని.. అదే తన లక్ష్యమని అన్నారు. దేశంలోని 272 జిల్లాల్లో డ్రగ్స్ కేసులు అధికంగా ఉన్నట్లు నివేదికలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
పాఠశాలలు, కాలేజీలు డ్రగ్స్, మద్యం మత్తు వల్ల ఎదురయ్యే పరిణామాలను అవగాహన కల్పించవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ యజ్ఞంలో పాఠశాలలు, హాస్పిటల్స్, ఆర్మీ వ్యక్తులు, సీఆర్పీఎఫ్, చదువుకున్న వ్యక్తులు, ప్రజలు అందరూ పాల్గొనాలని సూచించారు. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దేశాన్ని పొగాకు, మద్యం, డ్రగ్ ఫ్రీ నేషన్ గా మార్చాలని వేడుకున్నారు. డిసెంబర్ 25 నుంచి జనవరి 1 వరకూ డ్రగ్ డీలర్లు.. యువతను ఆకర్షించేందుకు ఉచితంగా డ్రింకులు ఆఫర్ చేస్తున్నారని అన్నారు. 5 కోట్ల మంది ప్రజలు.. డ్రగ్స్ వినియోగించమని ప్రతిజ్ఞ చేసినట్లు ఆయన వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మంది ఈ కార్యక్రమంలో చేరతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ దేశానికి స్వాతంత్య్రం రావడానికి 200 ఏళ్ళు పట్టిందని, అలానే ఈ ప్రపంచం నుంచి మాదకద్రవ్యాలను శాశ్వతంగా నిర్మూలించాలని ప్రజలు నిశ్చయించుకుంటే పదేళ్లలో డ్రగ్స్ రహిత దేశాన్ని చూడవచ్చునని ఆయన అన్నారు. అదన్నమాట విషయం.. డ్రగ్స్, మద్యం, పొగాకు వంటి వాటి వల్ల తీసుకున్న వ్యక్తే కాదు.. అతని వెనుక, చుట్టూ ఉన్న మనుషులు కూడా పోతారు. ఒక వ్యక్తి పోవడం అంటే.. ఒక కుటుంబం రోడ్డున పడడం అని అర్థం. మధ్యతరగతి బతుకులు రోడ్డున పడితే చూసి ఆ గుండె తట్టుకోలేదు.
కాబట్టి వీలైనంత ఎక్కువ మందిని ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నించడం మన వంతు బాధ్యత. డ్రగ్స్, మద్యం, పొగాకు వంటి హానికరమైన వాటికి మీలో ఎంతమంది దూరంగా ఉన్నారు. వీటికి దూరంగా ఉండమని మీలో ఎంతమంది అవగాహన కల్పిస్తున్నారు. మద్యం అలవాటు లేని ఒక కూలి పని చేసుకునే వ్యక్తికిచ్చి పెళ్లి చేసినా పర్లేదు కానీ మద్యం అలవాటు ఉన్న యువకుడికి, ఆడు ధనవంతుడైనా సరే పెళ్లి చేయవద్దు అంటూ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసిన కౌశల్ కిషోర్ పై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ చేయండి.