దేశంలో ఏ రాష్ట్రంలోనైనా కొత్త ప్రభుత్వం ఏర్పడిందంటే మొదట చేసే పని పథకాలకు గత ప్రభుత్వం పెట్టిన పేర్లు మార్చడం, ఫొటోలు తీయించడం, బస్సులకు రంగులు మార్చడం వంటివి అనమాట. అది అందరికీ తెలిసిందే, చూసింది కూడా. అలాంటి ఓ నిర్ణయాన్ని తోసిపుచ్చి తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్ అందరికీ భిన్నమైన సీఎంగా అభినందనలు పొందుతున్నారు. ఆయన నిర్ణయంతో కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అవ్వడమే కాదు.. ప్రతిపక్షాలు సైతం ఆయన ప్రశంసలు అందుకుంటున్నారు.
విషయం ఏంటంటే స్కూళ్లు తెరుస్తున్నారు. పిల్లలకు పంపిణీ చేయాల్సిన స్కూల్ బ్యాగులు అలాగే ఉన్నాయి. పంపిణీ చేయాలంటే వాటిపై ఉన్న ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, పళనిస్వామిల ఫొటోలు తొలగించాలి. అది ఒకటి రెండు బ్యాగులు కాదు అక్షరాల 65 లక్షల స్కూల్ బ్యాగులపై నుంచి ఫొట్లో తొలగించాలి. ఆ పనికోసం రూ.13 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించాలి. ఆ నిర్ణయానికి సీఎం ఎం.కె.స్టాలిన్ ససేమిరా అన్నారు. మాజీ ముఖ్యమంత్రుల ఫొటోలు అలాగే ఉంచాలని ఆదేశించారు. అందుకు ఉపయోగించాలనుకున్న సొమ్మును విద్యార్థులకు ఉపయోగపడేలా ఏదైనా పథకానికి ఉపయోగించాలని సూచించారు.
మాజీ సీఎంల ఫొటోల అంశంపై పార్టీ వర్గాల నుంచి చాలా ఫిర్యాదులు వస్తున్నాయని సీఎం దృష్టికి తీసుకెళ్లినప్పుడు ‘నేను ఒక మంత్రిని అయ్యాను. ఒక పార్టీకి చెందిన వ్యక్తిగా మాట్లాడలేను. అలా రాజకీయం గురించి మాట్లాడాలనుకుంటే పార్టీ హెడ్క్వార్టర్కి వస్తానని’ సీఎం తెలిపినట్లు అసెంబ్లీలో పొయ్యమోజి ప్రస్తావించారు. ఈ నిర్ణయంపై స్పందించిన ఏఐఏజీఎంకే సీనియర్ నాయకుడు జె.సి.డి.ప్రభాకర్ స్టాలిన్ మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. ఆ డబ్బును మంచి పథకానికి ఉపయోగిస్తే బావుంటుందన్నారు. ఈ నిర్ణయంతో ప్రతిపక్షాల పట్ల డీఎంకే ప్రవర్తన మారినట్లు తెలుస్తోందన్నారు. గతంలోనూ స్టాలిన్ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభాకర్ గుర్తు చేశారు. ఒకవేళ ఆ ఫొటోలు మారిస్తే ప్రజల నుంచి కచ్చితంగా వ్యతిరేకత వచ్చేదని తెలిపారు.
ప్రతిపక్షాలతో స్నేహపూర్వకంగా మెలగడం ఇదేం తొలిసారి కాదు. పగ్గాలు చేపట్టిన తొలినాళ్లలోనే కరోనాపై ఆల్పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి.. ప్రతిపక్ష నేతలను అధికారపార్టీ మంత్రుల పక్కనే కూర్చోబెట్టారు. కోరనాపై మల్టీపార్టీ కొవిడ్ సలహా కమిటీని ఏర్పాటు చేసిన స్టాలిన్ అందులో ఏఐఏడీఎంకేకి చెందిన మాజీ ఆరోగ్య శాఖ మంత్రికి స్థానం కల్పించారు. ఇలాంటి ఎన్నో నిర్ణయాలను తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్ తీసుకుని అందరికంటే భిన్నంగా రాజకీయాలు చేస్తున్నారని అభిమానులు కొనియాడుతున్నారు.