ఒడిశాలోని బాలాసోర్ జిల్లా వద్ద జరిగిన ఘోర రైళ్ల ప్రమాద ఘటన ఇప్పటికీ బాధిత కుటుంబ సభ్యులు మర్చిపోలేకపోతున్నారు. ఈ ఘటనలో 288 మంది చనిపోగా.. వెయ్యి మందికి పైగా గాయాలపాలయ్యారు. ప్రస్తుతం వారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
దేశంలో ఇప్పటి వరకు ఎన్నో రైలు ప్రమాదాలు జరిగాయి.. కానీ కొన్ని విషాదాలు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటాయి. ఒడిశాలోని బాలాసోర్ వద్ద జరిగిన ఘోర రైళ్ల ప్రమాద ఘటనలో దాదాపు 288 మంది ప్రయాణీకులు మృత్యువాతపడ్డారు. 1000 మంది వరకు గాయాలపాలయ్యారు. యావత్ దేశ ప్రజలు ఈ ఘటనతో తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సెలబ్రెటీలు, రాజకీయ నేతలు ప్రతి ఒక్కరూ మృతుల కుటుంబ సభ్యులకు తమ సానుభూతి ప్రకటించారు. తాజాగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రైలు ప్రమాదంలో మృతి చెందిన వారికోసం కీలక నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. తాజాగా ఈ ప్రమాదంలో మరణించిన పశ్చిమబెంగాల్ వాసుల కుటుంబ సభ్యులకు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఓ శుభవార్త చెప్పారు. తమ రాష్ట్రానికి చెందిన మృతుల కుటుంబాల్లో వారికి అర్హతను బట్టి ఒక్కొక్కరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అంతేకాదు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అవయవాలు కోల్పోయిన వారి బంధువులకు సైతం ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. దేశంలో కోరమండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.. మరణించిన, గాయపడిన కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక ఆందోళన చెందుతున్నారు. వారి బాధలను తొలగించడం కోసమే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సీఎం మమత బెనర్జీ తెలిపారు.
రైలు ప్రమాదంలో గాయపడి భువనేశ్వర్, కటక్ నగరాల్లో పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని మంగళవారం పరామర్శించి బాధితులకు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. బుధవారం బాధిత కుటుంబాలను కలిసి వారికి ఎక్స్ గ్రేషియా చెక్కుతో పాటు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను కూడా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై మమత మరోసారి స్పందిస్తూ.. రైలు ప్రమాద ఘటనను రాజకీయం చేయవొద్దని.. రైల్వే సేఫ్టీ కమిషన్ వెంటనే అన్ని రకాల చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని కోరారు. మరోవైపు ఈ ప్రమాద ఘటనపై కేంద్రం సీబీఐ విచారణ చేపట్టినట్ట విషయం తెలిసిందే.