ఎనిమీ ప్రాపర్టీ అమ్మకాల ద్వారా భారీగా నిధులను ఆర్జించినట్లు కేంద్ర సర్కారు వెల్లడించింది. అసలు ఏంటీ ఎనిమీ ప్రాపర్టీ? అవి ఎవరికి చెందుతాయి? దీని కథాకమామీషు ఏంటంటే..!
దేశంలోని శత్రువుల ఆస్తులను అమ్మడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.3,400 కోట్లను ఆర్జించింది. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. విక్రయించిన శత్రువుల ఆస్తుల్లో ఎక్కువ భాగం షేర్లు, బంగారం, రెవెన్యూ రిసీట్ల లాంటి చరాస్తుల రూపంలోనే ఉన్నాయని వెల్లడించింది. ‘శత్రువుల ఆస్తుల ద్వారా వచ్చిన రూ.3,407.98 కోట్లను కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ ఆఫ్ ఇండియా (సెపీ) రిలీజ్ చేసింది. ఇందులో మొత్తం 152 సంస్థలకు చెందిన 7.53 కోట్ల షేర్లు ఉన్నాయి. వీటి విలువ రూ.2,708.9 కోట్లు. ఇక, మరో రూ.699.08 కోట్లు రెవెన్యూ రిసీట్ల రూపంలో ఉన్నాయి’ అని హోంశాఖకు చెందిన ఓ అధికారి స్పష్టం చేశారు.
వీటితో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మింట్ ద్వారా 2021 జనవరిలో 1,699.79 గ్రాముల బంగారాన్ని అమ్మడం ద్వారా రూ.49.14 లక్షలు, అలాగే వెండి ఆభరణాల విక్రయం ద్వారా రూ.49.14 లక్షలు ఆర్జించినట్లు ఆ అధికారి పేర్కొన్నారు. బంగారం, షేర్లు, రెవెన్యూ రిసీట్ల వంటి చరాస్తుల రూపంలోనే డబ్బులను ఆర్జించినట్లు హోంశాఖ అధికారి తెలిపారు. అయితే ఇప్పటివరకు శత్రువులకు చెందిన ఎలాంటి స్థిరాస్తులను సర్కారు సొమ్ము చేసుకోలేదని చెప్పారు. ఇక, ఎనిమీ ప్రాపర్టీ అంటే ఏంటో తెలుసుకుందాం.. భారత్ – పాకిస్థాన్ విభజన, 1962, 1965 యుద్ధాల తర్వాత భారతీయులు ఎవరైనా పాక్, చైనా వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం చాన్స్ ఇచ్చింది.
అయితే ఆ దేశాల పౌరసత్వం తీసుకున్న వారి స్థిర, చరాస్తులు మాత్రం కేంద్రానికే చెందుతాయని అప్పట్లో నోటిఫికేషన్ జారీ చేసింది. భారత్ను అప్పట్లో అలా వదిలి వెళ్లిన వారి ఆస్తులనే ఎనిమీ ప్రాపర్టీ అంటారు. శత్రు ఆస్తులు, భూముల నిర్వహణ బాధ్యతలను సెపీకి కేంద్రం అప్పగించింది. మన దేశంలో మొత్తంగా 12,611 శత్రు ఆస్తులు ఉన్నాయి. అందులో 12,386 ఆస్తులు పాకిస్థాన్ పౌరసత్వం తీసుకున్నవారివి కాగా.. మిగతా 126 ఆస్తులు చైనా జాతీయులవి. అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్లో 6,255 ఎనిమీ ప్రాపర్టీలను గుర్తించగా.. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్లో 4,088 ఆస్తులు ఉన్నట్లు తేలింది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో 659, గోవాలో 295, మహారాష్ట్రలో 208, తెలంగాణలో 158, గుజరాత్లో 151, త్రిపురలో 105, బిహార్లో 84, మధ్యప్రదేశ్లో 94, ఛత్తీస్గఢ్లో 78, హరియాణాలో 71 శత్రు ఆస్తులను గుర్తించారు.