సెంట్రల్ సిలబస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఆరు, ఏడు తరగతుల్లో ఒక కీలకమైన పాఠ్యాంశాన్ని కొత్తగా చేర్చింది.
కేంద్ర సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై సెంట్రల్ సిలబస్లో భగవద్గీతను పాఠ్యాంశంగా బోధించనున్నారు. సెంట్రల్ సిలబస్లోని ఆరు, ఏడు తరగతుల్లో భగవద్గీతను పాఠ్యాంశంగా చేర్చుస్తూ మోడీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకొస్తున్న కొత్త ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఆరు, ఏడు తరగతుల్లో భగవద్గీతను పాఠ్యాంశంగా చేర్చనున్నారు. అంతే కాకుండా భగవద్గీతలోని శ్లోకాలను 11, 12 తరగతుల్లోని (ఇంటర్మీడియట్) సంస్కృత పుస్తకాల్లోనూ పాఠ్యాంశాలుగా చేరుస్తున్నామని కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి పార్లమెంటులో తెలియజేశారు. విద్యార్థుల సమగ్ర వికాసానికి దేశ సంస్కృతిని, జ్ఞాన వ్యవస్థను పరిచయం చేయడం దీని ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు.
భగవద్గీతలోని విలువలను స్టూడెంట్స్కు అందించడం తమ ధ్యేయమని మంత్రి అన్నపూర్ణ చెప్పారు. ఈ మేరకు ఇప్పటికే భారతీయ నాలెడ్జ్ సిస్టమ్స్ అన్ని కోణాల్లో తన రీసెర్చ్ను ప్రారంభించిందన్నారు. రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల విద్యాశాఖ కార్యాచరణ ఇప్పటికే షురూ అయ్యిందని ఆమె అన్నారు. వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి.. గ్రాస్ రూట్ స్థాయిల నుంచి ఇన్పుట్లను ఆహ్వానించే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్స్ (ఎన్సీఎఫ్) అభివృద్ధిని ఎన్సీఈఆర్టీ ప్రారంభించిందని అన్నపూర్ణ వివరించారు.
ఈ శతాబ్దంలో జ్ఞానశక్తిగా మారాలంటే, మనం మన వారసత్వాన్ని తప్పక అర్థం చేసుకోవాలని అన్నపూర్ణ చెప్పుకొచ్చారు. ప్రపంచానికి భారతీయ మార్గాన్ని బోధించాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యంగా పార్లమెంటరీ ప్యానెల్లో ఈశాన్య రాష్ట్రాలతో పాటు దేశంలోని చాలా ప్రాంతాలకు చెందిన వెలుగులోకి రాని స్వాతంత్ర్య సమరయోధుల వీరగాథలు, విజయాలు, త్యాగాలను పొందుపరచాలని ఎన్సీఆర్టీకి తాము సూచించామన్నారు. అంతేకాదు వివిధ వృత్తులకు చెందిన ప్రముఖ భారతీయ మహిళల జీవితాలను కూడా విద్యార్థులకు పాఠ్యంశాలుగా అందించాలని చెప్పామన్నారు. వీటిని ఎన్సీఈఆర్టీ రెగ్యులర్ బుక్స్లో చేర్చాలని ఆమె సూచించామన్నారు.