ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి వరదలు ప్రవహిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇప్పటి వరకూ 22 మంది మరణించారు. కాగా ఓ బస్సు వరదల్లో చిక్కుకుంది.
ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాల కారణంగా నదులు ఉప్పొంగుతున్నాయి. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్రస్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఈ రాష్ట్రాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. మరోవైపు బలమైన ఈదురుగాలులు, కొండచరియలు విరిగిపడడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగి పడి కొందరు, వరదల్లో చిక్కుకుని కొందరు మొత్తం 22 మంది మరణించారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో 17 మంది మరణించగా.. ఉత్తర ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 5 మంది మరణించారు.
హిమాచల్ ప్రదేశ్ లో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మనాలిలో వరద ఉధృతికి పలు దుకాణాలు, కార్లు కొట్టుకుపోయాయి. బియాస్ నది, మరో టూరిస్ట్ స్పాట్ వద్ద దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో ఇప్పటి వరకూ కొండచరియలు విరిగిపడిన ఘటనలు 14 నమోదవ్వగా.. 13 ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ రాష్ట్రంలో 700 చోట్ల రోడ్లు మూసుకుపోయాయి. ని ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఉత్తరాఖండ్ లో సైతం ఇదే పరిస్థితి. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా నదులు ఉప్పొంగుతున్నాయి. ఈ క్రమంలో ఉత్తరాఖండ్ లోని ఓ నది దాటేందుకు ప్రయత్నించగా బస్సు వరదల్లో చిక్కుకుంది. బస్సు ఒక పక్కకు ఒరిగిపోయింది. దీంతో ప్రయాణికులు భయపడ్డారు. ఆ తర్వాత బస్సు కిటికీల్లోంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Watch | Bus Tries To Cross River In Uttarakhand, Starts Tilting, Passengers Jump Out pic.twitter.com/anspZg5PiX
— NDTV (@ndtv) July 9, 2023