సాధారణంగా బస్టాండ్, ట్రాఫిక్ కూడళ్లు వద్ద డబ్బులు అడుగుతూ హిజ్రాలు కనిపిస్తుంటారు. హిజ్రాలను చూడగానే చాలా మంది ముఖం తిప్పుకుంటారు.. కొంతమంది డబ్బులు ఇస్తుంటారు. అలా డబ్బు తీసుకున్న హిజ్రాలు దీవించిపోతుంటారు. హిజ్రాలు ఆశీర్వదిస్తే మంచి జరుగుతుందని అంటుంటారు. కొంతమంది హిజ్రాలు అబ్బాయిలను తెగ వేధిస్తుంటారు.. వారి దగ్గర బలవంతంగా డబ్బులు వసూళ్లు చేస్తుంటారు.. ఇవ్వకుంటే దౌర్జన్యం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక రైళ్లలో వీళ్ల దందాకు అడ్డూ అదుపు ఉండదని అంటుంటారు. అయితే అందరు హిజ్రాలు అలాంటి వారు కాదని కొన్నిసార్లు వారు సైతం గొప్ప మనసు చాటుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. రైలులో ఓ గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతుంటే అన్నీ తామే అయి ఆమెకు ప్రసవం చేసి మంచి మనసు చాటుకున్నారు. ఈ ఘటన బీహార్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే..
బీహార్ షేక్ పనురా జిల్లాకు చెందిన ఓ నిండు గర్భిణి తన భర్తతో కలిసి హల్వారా-పాట్నా జనశతాబ్ధి ఎక్స్ ప్రెస్ రైల్ లో ప్రయాణిస్తుంది. రైల్వే స్టేషన్ నుంచి బయలు దేరిన కొద్ది సేపటికే గర్భిణికి నొప్పులు రావడం మొదలయ్యాయి. భార్య పురిటి నొప్పులతో బాధపడుతుంటే భర్త అక్కడ ఉన్న మహిళలను సహాయం అడిగాడు.. కానీ ఏ ఒక్కరు కూడా స్పందించలేదు. ఒకవేళ ఆమెకు ఏదైనా జరిగితే తాము లేనిపోని చిక్కుల్లో పడతామని కొంతమంది ముందుకు రాలేదు. దిక్కుతోచని స్థితిలో ఆ మహిళ భర్త ఏడుస్తున్న సమయంలో అక్కడకు వచ్చిన కొంతమంది హిజ్రాలు గర్భిణి అవస్థ చూసి చలించిపోయారు. వెంటనే రైలులోని విశ్రాంతి గదిలోకి తీసుకు వెళ్లి ఆమెకు ప్రసవం చేశారు. ఆ మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
సమాజంలో చాలా మంది హిజ్రాలను చిన్న చూపు చూస్తుంటారు. అలాంటి వారు తారసపడితే పక్కకు తప్పుకుంటారు. జీవించడం కోసం వేరే దారిలేక ఇలా డబ్బులు అడుగుతామని హిజ్రాలు తమ బాధన వ్యక్తం చేస్తుంటారు. రైల్ లో సాటి మహిళలే ముందుకు రాని పరిస్థితిలో ఎలాంటి సంబంధం లేని హిజ్రాలు అన్నీ తామై గర్భిణికి పురుడు పోశారు. తల్లి బిడ్డలను క్షేమంగా కాపాడారు. గొప్ప మనసు చాటుకున్న హిజ్రాలను కోచ్ లో అందరూ ఎంతో మెచ్చుకున్నారు.. వారిని అభినందించారు.