అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన యువకుడు మిరామ్ తరోన్ (17) సరిహద్దుల వద్ద అదృశ్యమై తిరిగి భారత్ కు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే తమ కుమారుడిని చైనా చిత్ర హింసలు పెట్టినట్లు ఆ యువకుడి తండ్రి ఒపాంగ్ తరోన్ ఆరోపించారు. అతడికి కరెంట్ షాక్ ఇచ్చారని, ఆ దేశ అధీనంలో ఉన్నన్ని రోజులూ కళ్లకు గంతలు కట్టి, చేతులను తాళ్లతో కట్టేసి ఉంచినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడు ఇంకా ఆ షాక్ లోనే ఉన్నట్లు వాపోయారు.
ఈ సంఘటనతో తన కొడుకు మానసికంగా కుంగిపోయాడని వాపోయారు. ఈ ఘటన తనను ఎంతో భయపెట్టిందన్నారు. వీపు భాగంలో కొట్టారు. ఎలక్ట్రిక్ షాకిచ్చారు. చైనా బలగాల అదుపులో ఉన్నన్ని రోజులూ అతడి కళ్లకు గంతలు కట్టే ఉంచారు. చేతులను తాళ్లతో కట్టేశారు. తినే సమయంలో మాత్రమే ఆ కట్లను విప్పారు అని వాపోయారు. కానీ తగినంత ఆహారం అందించినట్లు తెలిపారు.
ఏం జరిగిందంటే:
అప్పర్ సియాంగ్ జిల్లా జిడో గ్రామానికి చెందిన మిరామ్ తరోన్ అనే యువకుడు గత నెల 18 న భారత్ – చైనా సరిహద్దుల్లోకి వెళ్లి కనిపించకుండా పోయాడు. అయిది చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలు అపహరించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై అరుణాచల్ తూర్పు ఎంపీ తాపిర్ గావ్ తొలుత వెల్లడించారు. మిరామ్ వెంటే ఉన్న అతడి స్నేహితుడు జానీ యాయింగ్ చైనా సైనికుల నుంచి తప్పించుకోగలిగాడని ఆయన ట్వీట్ చేశారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం, భారత ఆర్మీ వర్గాలు మాత్రం ఈ ఘటనను అదృశ్యంగా పేర్కొన్నాయి. ఈ అంశంపై భారత ఆర్మీ అధికారులు.. హాట్ లైన్ ద్వారా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీ ఎల్ఏ) తో సంప్రదింపులు జరిపారు.
దీంతో అప్రమత్తమైన చైనా బలగాలు తమ భూభాగంలో ఓ బాలుడిని గుర్తించినట్లు వెల్లడించాయి. తరువాత ఆధారాల ద్వారా ఆ యువకుడు తప్పిపోయిన అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన మిరామ్ తరోన్ ధ్రువీకరించాయి. రక్షణ శాఖతో పలు మార్లు సంప్రదింపుల అనంతరం జనవరి 27న భారత సైన్యానికి తరోమ్ ను చైనా బలగాలు అప్పగించాయి. పలు వైద్య పరీక్షలు, క్వారంటైన్ అనంతరం భారత సైన్యం ఆ యువకుడిని కుటుంబసభ్యులకు అప్పగించింది. ఇంటికి చేరిన తరోన్ కు కుటుంబ సభ్యులు, స్థానికులు ఘనస్వాగతం పలికారు. ఎంపీ తాపిర్ గావ్ సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించారు.