అమర్నాథ్ యాత్రలో అపశృతి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆకస్మకంగా వచ్చిన భారీ వరదల వల్ల చాలా మంది యాత్రికులు ప్రమాదంలో చిక్కుకున్నారు. ఇక ఈ ప్రమాదంలో చనిపోయినవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే 15 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మరో 40 మంది గల్లైంతైనట్లు భావిస్తున్నారు. గల్లంతైన వాళ్ల ఆచూకి కోసం గాలిస్తున్నారు. రాత్రి కూడా సహాయచర్యలు కొనసాగాయి. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైన్యం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మృతుల సంఖ్య మరింతగా పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇక అమర్నాథ్ యాత్రలో సంభవించిన ఆకస్మిక వరదల నుంచి గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తృటిలో తప్పించుకున్నారు.
ఎమ్మెల్యే రాజా సింగ్ కుటుంబసభ్యులతో కలిసి అమర్ నాథ్ వెళ్లారు. భోలేనాథ్ దర్శనం అనంతరం తిరుగుపయనమయ్యారు. అంతలోనే భారీ వర్షాలు, వరదలు వచ్చాయి. అప్పటికే రాజా సింగ్ టీమ్ సురక్షిత ప్రాంతంలో ఉంది. ఆకస్మిక వరదలతో టెంట్లు కొట్టుకుపోయి.. భక్తులు వరదలో కొట్టుకుపోయిన ప్రాంతాన్ని రాజా సింగ్ దాటిపోయిన 10 నిమిషాలకే ఈ ఘటన జరిగింది. వరదలు వచ్చిన ప్రాంతానికి అరకిలోమీటర్ దూరంలో రాజాసింగ్ ఉండగా ఈ ఘటన జరిగింది. వరదలకు సంబంధించిన వివరాలను రాజాసింగ్ ఫోన్ ద్వారా తెలుగు మీడియాకు అందించారు. వరదలతో పలు టెంట్లు కొట్టుకుపోయాయని, 40 మంది వరకు వరదల్లో కొట్టుకుపోయారని చెప్పారు.
ఇది కూడా చదవండి: Amarnath Yatra: అమర్నాథ్ యాత్రలో అపశృతి.. ఆకస్మిక వరదలు..10 మంది మృతి!
ఈ సందర్భంగా రాజా సింగ్ మాట్లాడుతూ.. ‘‘ఇటీవలే నా కుమార్తె వివాహం జరిగింది. కుమార్తె, అల్లుడు, మరో 11 మంది కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 6న అమర్నాథ్ యాత్ర కోసం హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లాం. వాతావరణం అనుకూలించక హెలికాప్టర్ రద్దు కావడంతో ఢిల్లీ నుంచి అతికష్టం మీద గురువారం సాయంత్రం పంచతరణికి చేరుకున్నాం. రాత్రి అక్కడ ఓ టెంట్లో నిద్రించి శుక్రవారం ఉదయం ఆరు గంటలకు గుర్రాలపై అమర్నాథ్ చేరుకున్నాం’’ అన్నారు.
‘‘మధ్యాహ్నం ఒంటి గంటకు దర్శనం ముగించుకుని.. అరకిలోమీటరు దూరం నడిచామో లేదో.. ఒక్కసారిగా భయంకరమైన శబ్దంతో కొంత దూరంలో వరద కనిపించింది. భక్తులు పెద్ద సంఖ్యలో ఉండటంతో హాహాకారాలు, ఉరుకులు, పరుగులు మొదలయ్యాయి. మాకు కొంత దూరంలోనే వరద ప్రవాహంలో ఎంతోమంది కొట్టుకుపోతున్న దృశ్యాలు చూసి ప్రాణాలతో బయటపడతామా.. అనే భయం కలిగింది. సమయానికి గుర్రాలు దొరికాయి. క్షణం ఆలస్యం చేయకుండా అక్కడ నుంచి తిరుగు ప్రయాణం అయ్యాం’’ అని రాజా సింగ్ తెలిపారు.
‘‘కిందకు దిగేందుకు సుమారు మూడు గంటల సమయం పట్టింది. నాకు తీవ్రవాదులు నుంచి ముప్పు పొంచి ఉందన్న విషయం తెలుసుకొని అక్కడి పోలీసులు ప్రత్యేక ఎస్కార్ట్ వాహనం సమకూర్చి.. నన్ను, నా కుటుంబ సభ్యులని వెంటనే శ్రీనగర్కి తరలించారు. దర్శనం పూర్తయిన తర్వాత ఓ పది నిమిషాలు ఆలస్యం అయితే ప్రాణాలు పోయి ఉండేవి. అదృష్టవశాత్తు బయటపడ్డాం. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన వందలాది మంది భక్తులు అక్కడ మాకు ఎదురయ్యారు. వారందరిని సురక్షిత ప్రాంతానికి చేర్చడానికి భద్రతా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టడం కనిపించింది’’ అని చెప్పుకొచ్చారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: సానియాపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్.!