నేషనల్ డెస్క్- హిమాచల్ప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. కొండచరియలు విరిగిపడి భారీ ప్రాణ నష్టం సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 11 మంది మృతి చెందినట్టు అధికారులు చెప్పారు. మరో 14 మంది గాయపడగా, 25 నుంచి 30 మంది ఆచూకీ గల్లంతయినట్టు అధికారులు తెలిపారు. కిన్నౌర్ జిల్లాలోని రెకాంగ్ పియో, సిమ్లా జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్నవారిని బయటకు తీయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కిన్నౌర్ నుంచి సిమ్లాకు వెళ్తున్న హిమాచల్ప్రదేశ్ ఆర్టీసీకి చెందిన ఓ ప్రయాణికుల బస్సు, ఓ ట్రక్కు, కొన్ని కార్లు కొండచరియల కింద చిక్కుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఆర్టీసీ బస్సులో మొత్తం 40 మంది ప్రయాణీకులు ఉన్నట్లు ఐటీబీపీ పోలీసులు తెలిపారు. శిధిలాల క్రింద ఓ టాటా సుమో నుజ్జు కావడంతో అందులో ఉన్న 8 మంది అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో అయిదుగురు మహిళలు, ఓ చిన్న పాప ఉన్నారు. గత నెలలోనూ కిన్నౌర్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి 9 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. వర్షాకాలం వచ్చిందంటే అక్కడ ప్రజలు భయపడుతున్నారు.
ఎప్పుడు ఎక్కడ కొండ చరియలు విధ్వంసం సృష్తిస్తాయో అన్న ఆందోళనతో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హిమాచల్ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని, కేంద్రం తరఫున అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.