దేశానికి అన్నం పెట్టే రైతుకు మొండి చేయి ఎదురౌతుంది. ఆరు గాలం పండించిన పంటకు సరైన ధర రాక, అప్పుల భారాన్ని మోయలేక ఉరికి వేలాడుతున్నారు. పట్టించుకోవాల్సిన ప్రభుత్వాలు సైతం పట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. తాజాగా రైతులను కించపరిచేలా మంత్రి వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది.
దేశానికి వెన్నెముక రైతు. పట్టెడన్నం పెట్టే రైతులకు గుప్పెడు బువ్వ దొరకడం లేదు. ఆరుగాలం పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేక విలవిలలాడుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా రైతుల సమస్యలు తీరడం లేదు. గిట్టుబాటు ధర కాదు కదా.. పెట్టిన పెట్టుబడి డబ్బులు కూడా రావడం లేదు. కొన్ని సార్లు దళారుల చేతుల్లో మోసపోయి.. నష్టానికి పంట అమ్మేస్తున్నారు. దీంతో అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఏటా దేశంలో అనేక మంది రైతులు ఉరికొయ్యలకు వేలాడుతున్నారు. అయితే వారి సమస్యలను తీర్చాల్సిన ఓ ప్రతినిధి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలోని సిల్లోడ్ నియోజకవర్గంలో ఇటీవల అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మార్చి 3-12 మధ్యలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, వ్యవసాయ శాఖ మంత్రి అబ్దుల్ సత్తార్ను మీడియా ప్రశ్నించగా.. ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం కొత్త కాదూ, ఏటా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయంటూ వ్యాఖ్యానించారు. ‘రైతులు ఆత్మహత్య చేసుకోవడం అనేదేమీ కొత్త కాదు. ఎన్నో ఏళ్లుగా ఇవి జరుగుతూనే ఉన్నాయి. నా నియోజవర్గంలోనే కాదు, మహారాష్ట్రలో ఎక్కడా ఇలాంటి దుర్ఘటనలు జరగకూడదని కోరుకుంటున్నాను’ అని వ్యాఖ్యానించారు. ఆయన ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే వర్గమైన శివసేన మంత్రి. రైతులపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. ప్రజలు సైతం ఆయన వ్యాఖ్యల పట్ల మండిపడుతున్నారు.
ఔరంగాబాద్ జిల్లాలోనే మరఠ్వాడా ప్రాంతంలో ఆరుగురు రైతులు బలవన్మరణానికి పాల్పడినట్టు సమాచారం. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేక ప్రాణాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే..ఈ ఆత్మహత్యలపై విచారణ జరింపేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేశామని మంత్రి అబ్దుల్ సత్తార్ వెల్లడించారు. గత వారం అకాలంగా కురిసిన వర్షాలకు చాలా మంది రైతులకు పంట నష్టం వాటిల్లగా.. సత్తార్ ఆదివారం పరిశీలించారు. నివేదికలు సమర్పించిన తర్వాత చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని, కేవలం ఒక్క రూపాయితోనే పంట బీమా కల్పిస్తున్నామన్నారు. అలాగే ఈ ఏడాది షిండే నేతృత్వంలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో రైతులకు రూ. 6 వేల సాయం అందిస్తున్నట్లు తెలిపారు