ఒంగోలు- ఈ మధ్య కాలంలో సహజీవనం చాలా సహజమైపోయింది. సినిమా స్టార్స్, సెలబ్రెటీలే కాదు, మామూలు జనం సైతం సహజీవనంవైపు మొగ్గుచూపుతున్నారు. ఐతే అమ్మాయి, అబ్బాయి సహజీవనం చేయడం మామూలే, కానీ ఇద్దరు అమ్మాయిలు కలిసి సహజీవనం చేయడమే విడ్డూరంగా ఉంది. అవును ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇద్దరు అమ్మాయిల సహజీవనం వివాదాస్పదంగా మారింది.
ఒంగోలులో ఫ్యామిలీ ఫ్రెండ్ ద్వారా లక్ష్మి, రాణి అనే ఇద్దరు యువతుల మధ్య పరిచయం ఏర్పడింది. అతి తక్కువ సమయంలోనే వీరిద్దరి మధ్య చనువుపెరిగింది. ఇంకేముంది వీళ్లిద్దరు గత కొన్నిరోజులుగా ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. వారిలో రాణి తల్లి పోలీసులను ఆశ్రయించింది. తన కుమార్తెను ట్రాప్ చేశారని, వీరిద్దరు వివాహం చేసుకున్నారని ఆరోపిస్తున్నారు.
తన కుమార్తెను తనకు అప్పగించాలని రాణి తల్లి పోలీసులకు విన్నవించుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు యువతలతో పాటూ ఆమె తల్లిని పిలిపించి విచారించారు. ఐతే రాణి మాత్రం లక్ష్మితోనే కలిసి ఉంటానని తేల్చి చెప్పేసింది. తమ ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదని, తాము అసలు పెళ్లి చేసుకోలేదని స్పష్టం చేసింది.
లక్ష్మి దగ్గర ఉండే తాను చదువుకుంటానంటానని పోలీసులకు చెప్పింది రాణి. తామిద్దరం అక్కా చెల్లెలా కలిసి మెలసి జీవిస్తున్నామని.. రాణికి ఇష్టం లేకున్నా మేనమామతో ఆమె తల్లి వివాహం చేసేందుకు సిద్దమైందని, ఆ పెళ్లి ఇష్టం లేకపోవడంతో తన దగ్గర ఉంటోందని లక్ష్మి చెప్పుకొచ్చింది. అంతే కాదు తాము కేవలం టిక్ టాక్ కోసమే పెళ్లి చేసుకున్నట్లు నటించామని లక్ష్మి స్పష్టం చేసింది.
తనను రాణి తల్లి 10లక్షల రూపాయలు డిమాండ్ చేసిందని లక్ష్మి ఆరోపించింది. ఐతే లక్ష్మి ఇంట్లో పనిచేసే ఆయా మాత్రం వీరిద్దరు పెళ్లి చేసుకున్నారని చెబుతోంది. ఇలా ఇద్దరు యువతుల సహజీవనం, పెళ్లి వివాదంపై ఏంచేయాలో పాలుపోక పోలీసులు అయోమయంలో పడ్డారు.