పోలీస్ స్టేషన్ లో ప్రేమ జంట.. బయటకు వచ్చేదేలే అంటున్న ప్రేమికులు..
ప్రేమకు రంగు, రుచి, వాసన వంటివి లేవని ఇప్పటికే అనేక మంది పెళ్లి చేసుకుని నిరూపించారు. సామాజిక వర్గం వేరైనా, మతం వేరైనా తమ అభిమతం ప్రేమే అంటూ పెద్దలను ఎదిరించి మరీ కలిసి ఉంటున్న జంటలు ఎన్నో ఉన్నాయి. తమను విడదీయాలని చూస్తే ఇంట్లోంచి వెళ్ళిపోయి మరీ రిజిస్టర్ మ్యారేజ్ లు చేసుకుంటున్నారు. కొన్ని ప్రేమ వివాహాలు పెటాకులు అవుతున్నాయి గానీ ప్రేమించిన వారిని విడదీయకూడదన్న కాన్సెప్ట్ కి పెద్దలు తలొంచాలనేది నేటి యువత కాన్సెప్ట్. ఈ క్రమంలోనే పాతికేళ్ళు పెంచిన పెద్దలను కాదని.. మిగతా శేష జీవితం కలిసుండే మనిషి ప్రేమించిన మనిషి ఎందుకు కాకూడదని తల్లిదండ్రుల శ్రమ తగ్గిస్తూ.. మ్యాట్రిమోనీ వారి పొట్ట కొడుతూ ఎంపిక చేసుకుంటున్నారు.
అలా ఓ జంట ఒకరినొకరు ఇష్టపడ్డారు. సామాజిక వర్గాలు వేరైనా గానీ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఈ కారణంగా ఇరువురి కుటుంబ సభ్యులు విడదీసే ప్రయత్నం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. చంద్రలత అనే యువతి ఒంగోలు కలెక్టరేట్ లో ఉద్యోగం చేస్తున్నారు. అదే కలెక్టరేట్ లో సతీష్ అనే యువకుడు డ్రైవర్ గా పని చేస్తున్నారు. కొంతకాలం ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఇదే విషయం ఇరువురి ఇంట్లో చెబితే కులాలు వేరంటూ అడ్డుచెప్పారు. దీంతో ఇద్దరూ తమ తల్లిదండ్రులకు చెప్పకుండా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ ఓ గుడిలో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు.
విషయం తెలిసిన వీరి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కులాంతర వివాహం చేసుకున్నామని తమని విడదీసే ప్రయత్నం చేస్తున్నారంటూ కొత్త జంట అద్దంకి పోలీసులను ఆశ్రయించింది. ప్రేమికుల ఫిర్యాదుతో ఇరువురి తల్లిదండ్రులను పిలిపించి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే తామిద్దరం కలిసే ఉంటామని.. బయటకు వెళ్తే తమను విడదీస్తారని.. పోలీస్ స్టేషన్ లోనే ఉంటామని యువతి, యువకుడు పట్టుబట్టారు. ఇద్దరూ మేజర్స్ కావడంతో పోలీసులు చర్యలు తీసుకుంటామని అన్నారు. అలానే ప్రేమ జంటకు, కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇస్తామని అన్నారు.