అమరావతి- వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మందు బాబులకు శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మధ్యం ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని చాలా ఆవేధన చెందుతున్న మందు బాబులకు ఏపీ సర్కార్ ఉరట కలిగించే నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మద్యం ధరలను తగ్గిస్తూ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం పన్ను రేట్లలో కీలక మార్పులు చేసింది.
మద్యంపై ఇప్పటి వరకు విధిస్తున్న వ్యాట్, అదనపు ఎక్సైజ్ డ్యూటీ ప్రత్యేక మార్జిన్లో హేతుబద్ధతను తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో మద్యం ధరలు భారీగా తగ్గనున్నాయి. మద్యం బ్రాండ్లను బట్టి 15 రూపాయల నుంచి 200 రూపాయల వరకు ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇకపై ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ రకం మద్యంపై 5 శాతం నుంచి 12 శాతం, ఇతర అన్ని కేటగిరీల మద్యంపై 20 శాతం వరకు ధరలు తగ్గేందుకు అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. బీర్లపై వ్యాట్ 10 నుంచి 20 శాతం తగ్గనుంది. మద్యంపై స్పెషల్ మార్జిన్ 36 శాతం, అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ 36 శాతం తగ్గే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే బీర్లపై 20 నుంచి 30 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఇక ఐఎంఎల్ లిక్కర్పై వ్యాట్ 35 నుంచి 50 శాతం తగ్గనుంది. స్పెషల్ మార్జిన్ 10 నుంచి 20 శాతం, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ 5 నుంచి 26 శాతం తగ్గబోతోంది. ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్లోకి వస్తున్న అక్రమ మద్యం, రాష్ట్రంలో నాటు సారా తయారీని అరికట్టేందుకే మద్యం ధరలను తగ్గిస్తున్నామని జగన్ సర్కార్ స్పష్టం చేసింది.
అంతే కాదు వచ్చే వారం నుంచి రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల్లోనూ ప్రముఖ కంపెనీల బ్రాండ్ల మద్యం విక్రయించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యల కారణంగా రాష్ట్రంలో 37 శాతం మేర మద్యం వినియోగం తగ్గిందని జగన్ సర్కార్ తెలిపింది. తగ్గించిన మద్యం ధరలు ఆదివారం నుంచే అమల్లోకి రానున్నాయి. మొత్తానికి మద్యం ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయంపై మందు బాబులు తెగ ఆనందపడిపోతున్నారు.