వయసు పదేళ్లే. కానీ సమాజం కోసం తనవంతుగా ఏదో చేయాలని భావించాడా పిల్లాడు. దీంతో సాహసయాత్రకు పూనుకున్నాడు. ఇంతకీ ఆ బాలుడేం చేశాడంటే..!
పదేళ్ల పిల్లలంటే మామూలుగా చదువు, ఆటల్లో బిజీగా ఉంటారు. స్కూలుకు వెళ్లిరావడం, వీలు దొరికినప్పుడు ఇతర పిల్లలతో కలసి ఆటపాటల్లో మునిగిపోతారు. బయటి ప్రపంచం గురించి అంతగా పట్టించుకోరు. కానీ ఈ పిల్లాడు అలాంటి వాడు కాదు. చిన్న వయసులోనే సమాజం కోసం ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో ఓ స్వచ్ఛంద సంస్థకు ఫండ్స్ సమకూర్చడం కోసం రోజూ ఇంట్లో కాకుండా బయటి ప్రదేశాల్లో టెంటు వేసుకొని మూడేళ్లుగా నిద్రపోతున్నాడు. ఇలా చేయడంతో దాదాపుగా రూ.7 కోట్ల నిధులు విరాళంగా వచ్చాయి. బ్రిటన్కు చెందిన పదేళ్ల బాలుడు మ్యాక్స్ వూజీ ఇంటి పక్కనే రిక్ అబాట్ అనే పెద్దాయన ఉండేవారు. ఆయన మ్యాక్స్ ఫ్యామిలీకి బాగా సన్నిహితుడు.
రిక్ అబాట్ 74 ఏళ్ల వయసులో క్యాన్సర్తో చనిపోయారు. అంతకుముందే రిక్ తన వద్ద ఉన్న టెంట్ను మ్యాక్స్కు ఇచ్చారు. దీంతో ఏదైనా సాహసం చేయమని ఆయన చెప్పిన మాటలు మ్యాక్స్ మెదడులో ఎంతో బలంగా నాటుకుపోయాయి. దీంతో 2020 మార్చిలో తాను ఇంట్లో కాకుండా మూడేళ్లపాటు ఆరుబయట టెంట్లో నిద్రించాలని డిసైడ్ అయినట్లు మ్యాక్స్ మీడియాకు తెలిపాడు. ఇలా చేయడం ద్వారా వచ్చిన డబ్బులను ఓ స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. దీంతో అతడ్ని ప్రోత్సహిస్తూ పెద్ద ఎత్తున విరాళాలు వచ్చాయి. ఆ మొత్తం రూ.7 కోట్లకు చేరింది. మ్యాక్స్ కృషికి ఎన్నో అవార్డులు అతడ్ని వరించాయి. బ్రిటిష్ అంపైర్ మెడల్, బేర్గ్రిల్స్ చీఫ్ స్కౌట్ అన్సంగ్ హీరో అవార్డు, ఎ ప్రైడ్ ఆఫ్ బ్రిటన్ పురస్కారాలకు అతడు ఎంపికయ్యాడు. మరి.. ఈ బాలుడి స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.