ఉదయాన్నే సూర్యోదయం పసుపు, నారింజ, ఎరుపు కలగలిపిన రంగులో ఉంటుంది. కానీ అమెరికాలో మాత్రం ఇందుకు భిన్నంగా మారింది. ఉన్నట్టుండి నారింజ రంగులోకి మారిపోయింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మరోవైపు అధికారులు అమెరికా వాసులకు హెచ్చరికలు జారీ చేశారు.
ఉదయం వేకువ జామున నిద్ర లేచి చూస్తే వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అప్పుడే ప్రసరిస్తున్న సూర్యకిరణాలు శరీరానికి తగిలితే చైతన్యం కలుగుతుంది. ప్రపంచంలో ఎక్కడ చూసినా వాతావరణం ఇలానే ఉంటుంది. కానీ ఒక్క చోట మాత్రం ఆకాశం ఆరెంజ్ రంగులోకి మారిపోయింది. 18 రాష్ట్రాల్లో ఆకాశం ఆరెంజ్ రంగుతో నిండిపోయింది. దీంతో ఒక్కసారిగా స్థానిక ప్రజలు ఆందోనళకు గురయ్యారు. మరోవైపు తమ ఫోన్లలో ఈ దృశ్యాలను చిత్రీకరించారు. అసలు ఏం జరుగుతోంది? వాతావరణం ఉన్నట్టుండి నారింజ రంగులోకి మారిపోవడానికి కారణం ఏంటి? మనుషులు చేసిన తప్పిదమేనా?
అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీల్లో ఆకాశం నారింజ రంగులో దర్శనమిస్తోంది ఆకాశాన్ని పొగ కమ్మేసింది. న్యూయార్క్, న్యూహ్యాంప్ షైర్ సహా సౌత్ కరోలినా వరకూ 18 రాష్ట్రాల్లో ఇదే రకంగా ఉంది వాతావరణం. పొరుగునే ఉన్న కెనడాలో చెలరేగిన కార్చిచ్చు వల్ల అమెరికాలోని 18 రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం పడింది. అక్కడ కాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తుంది. కార్చిచ్చు వల్ల వెలువడుతున్న పొగ వల్ల గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 218కి దిగజారింది. 1960 తర్వాత ఈ స్థాయిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పడిపోవడం ఇదే తొలిసారి. వాతావరణంలో చోటు చేసుకున్న ఈ మార్పుల కారణంగా విమానాలను దారి మళ్లించినట్లు న్యూయార్క్ విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. మరోవైపు రైళ్ల రాకపోకలను కూడా నిలిపివేశారు. లో-విజిబిలిటీ కారణంగా రాకపోకల్లో జాప్యం ఏర్పడినట్లు అధికారులు వెల్లడించారు.
కొన్ని రోజుల క్రితం కెనడాలోని వందలాది హెక్టార్ల అడవులు అగ్నికి ఆహుతయ్యాయి. కెనడా తూర్పు ప్రాంతంలో దీని తీవ్రత అధికంగా ఉంది. అక్కడ నుంచి దట్టమైన పొగ ప్రభావం పొరుగున ఉన్న అమెరికాలోని పలు నగరాలపై పడింది. దట్టమైన పొగ అలుముకోవడం వల్ల సూర్యకిరణాలు పరావర్తనం చెంది ఆకాశం నారింజ రంగులో కనిపించిందని నిపుణులు చెబుతున్నారు. అయితే 43 ఏళ్లలో కాలుష్యం ఇంత ప్రమాదకర స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి అని అంటున్నారు. న్యూజెర్సీ, న్యూయార్క్ నగర వాసులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సాయంత్రం వరావూ బయటకు రావొద్దని, ఒకవేళ వస్తే ఖచ్చితంగా ఎన్ 95 మాస్క్ ధరించాలని అధికారులు సూచించారు.