ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దీంతో పాకిస్తాన్ ఆర్థిక సహాయం కోసం ప్రపంచ దేశాలను వేడుకుంటుంది. ఈ క్రమంలో పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ భారత్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంతో 3 సార్లు యుద్ధాలు చేసిన తర్వాత పాకిస్తాన్ గుణపాఠం నేర్చుకుందని అన్నారు. పొరుగు దేశమైన భారత్ తో శాంతిని కోరుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే కాశ్మీర్ లో జరుగుతున్న వాటిని ఆపాలని సూచించారు. దుబాయ్ కేంద్రంగా పని చేసే ఓ న్యూస్ ఛానల్ తో మాట్లాడిన షెహబాజ్ షరీఫ్.. ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న వివాదాలపై నిజాయితీగా చర్చలు జరపాలని ప్రధాని నరేంద్ర మోదీకి పిలుపునిచ్చారు.
రెండు దేశాల మధ్య ఎంతో కాలంగా నడుస్తున్న కాశ్మీర్ సహా ఇతర వివాదాలపై నిజాయితీగా, నిబద్ధతతో చర్చలు జరుపుదామని, శాంతియుతంగా జీవనం సాగిస్తూ ప్రగతి సాధించడమో లేదా ఒకరికొకరు గొడవలు పడుతూ విలువైన సమయాన్ని, వనరులను వ్యర్థం చేసుకోవడమో అనేది మన చేతుల్లోనే ఉందని పాక్ ప్రధాని వెల్లడించారు. భారత్ తో పాకిస్తాన్ 3 యుద్ధాలు చేసిందని.. ఆ యుద్ధాలతో పాక్ ప్రజలకు మిగిలింది పేదరికం, వేదన, నిరుద్యోగం మాత్రమే అని అన్నారు. తాము గుణపాఠం నేర్చుకున్నామని, ఇప్పుడు భారత్ తో శాంతిని కోరుకుంటున్నామని అన్నారు. దీని వల్ల పాక్ లో నెలకొన్న అసలు సమస్యలను పరిష్కరించుకునే వీలుంటుందని అన్నారు.
అటు భారత్, ఇటు పాకిస్తాన్ ఇరు దేశాల్లోనూ ఇంజనీర్లు, డాక్టర్లు, నైపుణ్యం కలిగిన కార్మికులు ఉన్నారని.. దక్షిణాసియా కోసం ఈ వనరులను ఉపయోగించుకుని ఇక్కడ శాంతిని నెలకొల్పాలని కోరుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. దీని వల్ల రెండు దేశాలూ ప్రగతిని సాధించవచ్చునని, బాంబులు, మందు గుండు సామాగ్రి వంటి వాటిని తయారుచేసేందుకు తమ దగ్గరున్న వనరులను (మనుషులను) వృధా చేయాలనీ కోరుకోవడం లేదని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ లో తమ దేశ ప్రజలకు సబ్సిడీ కింద కనీస నిత్యావసర సరుకులను కూడా అందించలేక అతలాకుతలం అవుతుంది.
వంట గ్యాస్, గోధుమ పిండి వంటి వాటి ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. గోధుమ పిండి కోసం ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. మరోవైపు తహరీక్-ఎ-తాలిబన్ పాకిస్తాన్ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుంది పాకిస్తాన్. ప్రస్తుత పరిస్థితులు అంతర్గత యుద్ధానికి దారి తీస్తుండడంతో.. పాకిస్తాన్ వేరే దారి లేక భారత్ సహాయం కోరుతుంది. విదేశాల నుంచి కూడా పెద్దగా సహాయం అందకపోవడంతో ఇక ఇండియానే దిక్కు అని శాంతి కోసం చర్చలు జరిపేందుకు ప్రయత్నాలు చేస్తుంది. మరి దీనిపై భారత ప్రభుత్వం ఏమంటుందో చూడాలి. పాకిస్తాన్ తో భారత్ చర్చలు జరపడం వల్ల అంతా మంచే జరుగుతుందని మీరు భావిస్తున్నారా? పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలను భారత ప్రభుత్వం నమ్ముతుందా? లేదా? మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.