ఉదాహరణకు మీరు కారులో ఓ చోటుకి ప్రయాణం అవుతారు. మధ్యలో అనుకోని అవంతారాలు వచ్చి ఆలస్యం అవుతుంది. ఆ సమయంలో మీ కారు డ్రైవర్ ఆలస్యం గురించి బాధపడ్డా.. మిమ్మల్ని అక్కడే వదిలి వెళ్లడు. గమ్యస్థానానికి చేరుస్తాడు. అలా కాకుండా.. నేను ఈ టైం వరకే ఉంటాను అన్నాను.. మీరు లేట్ చేశారు. నాకు సంబంధం లేదని వెళ్లిపోడు కదా. కానీ ఓ చోట ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానం అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. ఆ తర్వాత వాతావరణం సెట్ అయ్యాక.. ప్రయాణం ప్రారంభించమంటే.. పైలెట్ నేను రాను.. నా షిఫ్ట్ టైమ్ అయిపోయింది. మీ ఇష్టం అంటూ మొండికేశాడు. దాంతో ప్రయాణికులు నిరసన వ్యక్తం చేశారు. చివరకు అధికారులు రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించారు. ఆ వివరాలు..
పాకిస్తాన్ ఇంటర్నెషనల్ ఎయిర్లైన్స్ (పీఐఏ)కు చెందిన విమానం పీకే-9754 రియాధ్ నుంచి ఇస్లామాబాద్ వెళ్లాల్సి ఉంది. అయితే వాతావరణం అనుకూలింకచకపోవడంతో.. సౌదీ అరెబియాలోని డమ్మంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. సమస్య సద్దుమణిగిన తర్వాత విమానం ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు. కానీ పైలెట్ మాత్రం.. తాను విమానాన్ని నడపలేనని తెలిపాడు. ఎందుకు అంటే.. అప్పటికే తన షిఫ్ట్ టైం అయిపోయిందని.. అందువల్ల తాను ఇప్పుడు విమానాన్ని నడపలేనని తెలిపాడు. మరోవైపు విమానంలో ఉన్న ప్రయాణికులు.. తాము కిందకు దిగే ప్రసక్తే లేదని.. వెంటనే విమానం కదలాల్సిందేనని డిమాండ్ చేశారు.
విషయం కాస్త ఉన్నతాధికారులకు చేరడంతో.. వారు రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించారు. పైలెట్ నిరంతరంగా విధులు నిర్వహించడం మంచిది కాదని.. ఫలితంగా ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. అతడికి సరిపడా విశ్రాంతి లభించిన తర్వాత.. విమానం తిరిగి బయలుదేరుతుందని.. అప్పటి వరకు ప్రయాణికులు హోటల్లో విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. అలా ఈ సమస్య సద్దుమణిగింది. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి.