ఉత్తర కొరియా నేడు మొట్టమొదటి మధ్యశ్రేణి క్రూయిజ్ క్షిపణిని పరీక్షించింది. ఇది 1,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించగలదు. ఈ విషయాన్ని ‘వాయిస్ ఆఫ్ కొరియా’ పేర్కొంది. తాజా పరీక్ష ఐరాస ఆంక్షల ఉల్లంఘన కాదు. కానీ, ఉ.కొరియా కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేయడం ఆపలేదు. ‘ఈ పరీక్ష వ్యూహాత్మకంగా ప్రత్యర్థులను భయపెట్టి ప్రభావవంతమైన రక్షణ కల్పిస్తుంది. అంటే ప్రత్యర్థి దేశాల సైనిక చర్యల నుంచి కచ్చితమైన రక్షణ ఉంటుంది’ అని ఉత్తరకొరియా న్యూస్ ఏజెన్సీ కేసీఎన్ఏ పేర్కొంది.
ఈ పరీక్షను జాగ్రత్తగా పరిశీలించి అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలతో కలిసి విశ్లేషిస్తామని దక్షిణ కొరియా ప్రతినిధులు తెలిపారు. ఒక పక్క ఐరాస ఆంక్షల కారణంగా ఉ.కొరియా దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. అయినా కానీ, ఆ దేశం లక్ష్య పెట్టకుండా ఈ క్షిపణి పరీక్షలు చేస్తోంది. వాస్తవానికి గత కొన్ని నెలలుగా భౌగోళిక రాజకీయ పరిణామాలు మారాయి. ఈ నేపథ్యంలో తాము ఆయుధ పరీక్షలు చేస్తే అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చే ప్రతిస్పందనలను అంచనా వేయడం కోసం ఇది చేసి ఉండవచ్చని భావిస్తున్నారు.
తాజాగా ప్రయోగించిన క్షిపణి విషయానికి వస్తే.. ఇది 1,500 కిలోమీటర్లు ప్రయాణించగలదు.. దాదాపు జపాన్ వరకూ వెళ్లగలదు. 7,780 సెకన్లలోనే టార్గెట్ ను తునాతునకలు చేసింది. ఈ మిస్సైల్ ను ప్యాటర్న్-8 ఫ్లయిట్-ఆర్బిట్గా పిలుస్తున్నారు. అంటే దీనిపై న్యూక్లియర్ వార్ హెడ్ అమర్చాలనే ఉద్దేశం ఉ.కొరియాకు ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 11, 12తేదిల్లో నార్త్ కొరియా గుర్తుతెలియని ఓ ప్రదేశం నుంచి ప్రయోగించిన మిస్సైల్ టార్గెట్ ను పూర్తి చేసిందని ఉత్తర కొరియా అధికారిక మీడియా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ(కేసీఎన్ఏ) వెల్లడించింది. గత ఆరునెల కాలంలోనే ఉత్తర కొరియా పలు క్షిపణి ప్రయోగాలను చేసింది. గత ఏడాది షార్ట్-రేంజ్ బాల్లిస్టిక్స్ క్షిపణులు, క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించింది. తాజాగా మరోసారి మిస్సైల్ ప్రయోగం చేయడం పై ప్రపంచ దేశాల్లో చర్చలు నడుస్తున్నాయి.