ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ క్రూరమైన మనస్తత్వం కలవాడన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని ప్రపంచం మొత్తం కోడైకూస్తోంది. అతడి నాయకత్వంలో నడుస్తున్న ఉత్తర కొరియా ప్రభుత్వం కూడా క్రూరమైన పాలనను అందిస్తోంది. దేశ ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్రాలు మొత్తం హరించి, వారిని బానిసలుగా మార్చి పాలన సాగిస్తోంది. ప్రస్తుత అధ్యక్షడు కిమ్ జాంగ్ ఉన్ క్రూర బుద్ధి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అతడు చిన్న చిన్న తప్పులకు కూడా ప్రాణాలు తీసే శిక్షలు విధిస్తాడు. ఇలా చాలా మంది తమ ప్రాణాలు కోల్పోయారు.
తాజాగా, దక్షిణ కొరియా సినిమాలు చూసినందుకు ఓ ఇద్దరు చిన్నారులపై దారుణానికి పాల్పడ్డారు ఉత్తర కొరియా అధికారులు. వారిద్దరినీ పబ్లిక్గా ఉరి తీశారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తర కొరియాకు చెందిన 16, 17 ఏళ్ల వయసు కలిగిన ఇద్దరు పిల్లలు దొంగచాటుగా దక్షిణ కొరియా సినిమాలు చూడసాగారు. నార్త్ కొరియాలో, దక్షిణ కొరియా సినిమాలు చూడటం తప్పు. ఆ తప్పు చేసినందుకు ఆ ఇద్దరు పిల్లల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత పబ్లిక్గా వారిద్దరికీ ఉరి వేసి చంపారు. గత అక్టోబర్ నెలలో జరిగిన ఈ సంఘటన తాజాగా, వెలుగులోకి వచ్చింది.
కాగా, 2020 సంవత్సరంలో బయటి దేశాలకు సంబంధించిన సినిమాలపై ఉత్తర కొరియా ప్రభుత్వం బ్యాన్ విధించింది. దీనికి కారణం లేకపోలేదు. దక్షిణ కొరియా షోలు నార్త్ కొరియా వ్యాప్తంగా బాగా ఫేమస్ అవుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బయటి దేశాలకు సంబంధించిన సినిమాలు చూసిన వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు పిల్లల్ని ఉరివేసి చంపారు. ఇక, నార్త్ కొరియా ప్రభుత్వం కొత్తగా ఓ వింత రూల్ను తెరపైకి తెచ్చింది. పిల్లల్లో దేశ భక్తిని పెంచే విధంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు బాంబ్, గన్, శాటిలైట్ అన్న పేర్లు పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది.