గత కొన్ని వందల ఏళ్లుగా శాస్త్రసాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించాం. ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేశారు సైంటిస్ట్లు. ఇక నేటి ఆధునిక కాలంలో మరిన్ని ప్రయోగాలు చేస్తూ.. సృష్టికి ప్రతి సృష్టి చేసే పనిలో ఉన్నారు. తాజాగా శాస్త్రవేత్తలు ఓ అరుదైన ఘనత సాధించారు. ఆ వివరాలు..
సాధారణంగా పిల్లలను కనాలంటే స్త్రీ, పురుషులు ఇద్దరు అవసరం. ఇదే ప్రకృతి ధర్మం. అయితే పెరుగుతున్న శాస్త్రసాంకేతికత కారణంగా ప్రకృతి ధర్మంలో కూడా అనేక మార్పులు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. వేల ఏళ్లుగా సైన్స్లో ఎంతో పురోగతి సాధించాం. ఎన్నో ఆవిష్కరణలు చేశాం.. ఎన్నో అంతుచిక్కని రహస్యాలను చేధించాం.. మొండి రోగాలకు చికిత్స కనిపెట్టాం. ఇక నేటి ఆధునిక కాలంలో సైన్స్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఆధునిక శాస్త్రవేత్తలు సృష్టికి ప్రతి సృష్టి చేసే పనిలో ఉన్నారు. దీనిలో భాగంగా శాస్త్రవేత్తలు ఓ అరుదైన ఘనత సాధించారు. రెండు మగ ఎలుకల నుంచి సంతానాన్ని ఉత్పత్తి చేశారు. ఈ ప్రయోగం విజయం సాధించడంతో.. మనుషుల మీద ఈ తరహా ప్రయోగాలు చేసేందుకు రెడీ అవుతున్నారు శాస్త్రవేత్తలు. ఆ వివరాలు..
జపాన్ శాస్త్రవేత్తలు ఈ అరుదైన ఘనత సాధించారు. రెండు మగ ఎలుకల నుంచి సంతానాన్ని ఉత్పత్తి చేశారు. జపాన్లోని క్యుషు, ఒసాకా విశ్వవిద్యాలయాల సైంటిస్ట్ టీం ఈ అరుదైన ఘనత సాధించింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో.. మానవుల్లో సంతానోత్పత్తి ప్రక్రియలో మార్పులు చోటు చేసుకోవడమే కాక.. సరికొత్త చికిత్సలకు ఈ ప్రయోగం దోహదపడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
ఈ సందర్భంగా క్యుషు విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త కట్సుహికో హయాషి మాట్లాడుతూ..‘‘ఈ పద్దతి విజయవంతం కావడంతో.. భవిష్యత్తులో ఇద్దరు పురుషులు కలిసి పిల్లల్ని కనేందుకు దోహదపడుతుంది. టర్నర్స్ సిండ్రోమ్ వంటి సంతానోత్పత్తి చికిత్సకు ఇది ఉపయోగపడుతుంది. ఒకవేళ ఎక్స్ క్రోమ్జోమ్ పూర్తిగా లేదా పాక్షికంగా మిస్ అయిన సందర్భంలో ఈ పద్దతిలో విజయవంతంగా చికిత్స చేయవచ్చు. పురుష అండాలను ఉపయోగించి ఓ బలమైన క్షీరదాన్ని సృష్టించడం ఇదే తొలిసారి’’ అని తెలిపారు.
ఈ ప్రయోగంలో భాగంగా శాస్త్రవేత్తలు ఇండ్యూస్డ్ ఫ్లూరీపొటెంట్ స్టెమ్ కణాలను సృష్టించడానికి మగ ఎలుగ చర్మ కణాలను తీసుకుని వాటిని స్టెమ్ సెల్ లాంటి స్థితికి రీప్రొగ్రామ్ చేశారు. తర్వాత వై క్రోమోజోమ్ను డిలీట్ చేశారు. ఆ స్థానంలో మరో ఎక్స్ క్రోమోజోమ్ను ప్రవేశపెట్టారు. ఆ కణాలు అండాలుగా తయారయ్యేలా చేశారు. ఇలా తయారైన ఈ అండాలను మరో ఎలుక వీర్యంతో ఫలదీకరణం చెందించారు. ఈ ప్రాసెస్లో మొత్తం 600 పిండాలు ఏర్పడ్డాయి. వాటిని సరోగేట్ ఎలుకలో ప్రవేశపెట్టగా.. అది తాజాగా ఏడు ఎలుక పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఈ ఎలుక పిల్లలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాయి. ఇక ఈ ఎలుక పిల్లలకు జీవశాస్త్రపరంగా రెండు తండ్రి ఎలుకలు అంటే ఇద్దరు బయోలాజికల్ ఫాదర్స్ ఉన్నట్లు భావించవచ్చు.
ప్రస్తుతం ఎలుకల్లో ఈ ప్రయోగం విజయవంతం కావడంతో.. త్వరలోనే మానవ కణాలపైనా ఈ తరహా విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించే పనిలో ఉన్నారు శాస్త్రవేత్తలు. రాబోయే పదేళ్లలో ఇది సాధ్యం కావొచ్చని భావిస్తున్నారు. మరి శాస్త్రవేత్తలు సాధించిన ఈ అరుదైన ఘనతపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.