ఇండియా లో తల్లిదండ్రులు పిల్లలని కొట్టినా తిట్టినా పెద్దగా పట్టించుకోరు. కానీ విదేశాల్లో అలా పిల్లలతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే కుదరదు. అక్కడ పేరెంట్స్ పిల్లలపై చేయి చేసుకున్న లేదా బూతులు తిట్టినా భారీ జరిమానాలు కొన్ని సందర్భాల్లో కటకటాల వెనక్కి కూడా వెళ్లాల్సి వస్తుంది. ఇక గల్ఫ్ దేశాలలో నైతే ఇలాంటి విషయాల్లో ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. దీంతో అక్కడ తల్లిదండ్రులు పిల్లలను భయపెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా మసలుకుంటారు. ఓ కుమారుడు తన తండ్రి తనను తిట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు ఆ తండ్రిని విచారణకు పిలిచారు. పోలీసుల వద్దకు వచ్చిన తండ్రి కోపంలో మరోసారి కొడుకుపై నోరు పారేసుకున్నాడు. పొరపాటున తండ్రి నోటి నుంచి ‘గాడిద’ అనే పదం వచ్చింది. ఈ విషయం కాస్తా కువైత్ పబ్లిక్ ప్రాసిక్యూషన్కు చేరింది. దాంతో కుమారుడిని దూషించినందుకు తండ్రికి పబ్లిక్ ప్రాసిక్యూషన్ 200 కువైటీ దినార్లు(సుమారు రూ.48వేలు) జరిమానా వేసింది.
కువైత్లో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారేమీ కాదు. ఇంతకుముందు 2018లో కూడా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. పిల్లలతో తప్పుగా మాట్లాడినందుకు ఓ తల్లి నెల రోజుల పాటు జైలుకి వెళ్లాల్సి వచ్చింది. పిల్లలు ఇంటి దగ్గర చదువుకుంటున్న సమయంలో వారు అల్లరి చేస్తుండడంతో వారిని గాడిదలు అని తిట్టింది. దాంతో పిల్లలు ఈ విషయాన్ని వారి తండ్రికి చెప్పారు. తన పిల్లలను తిట్టడం, కొట్టడం చేస్తుందని భార్యపై కోర్టులో కేసు వేశాడు. అందుకు సంబంధించిన ఆడియో, వీడియో ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించాడు. వాటిని పరిశీలించిన న్యాయస్థానం పిల్లలతో తప్పుగా మాట్లాడినందుకు తల్లిని 30 రోజుల జైలు శిక్ష విధించింది.
కువైత్ ప్రభుత్వం 2015లో తీసుకువచ్చిన ప్రత్యేక చట్టం ప్రకారం కోర్టు ఆమెకు ఈ శిక్ష విధించింది. ఈ చట్టం ప్రకారం కువైత్లో పిల్లలను పేరెంట్స్ దూషించడం, కొట్టడం తీవ్ర నేరంగా పరిగణించబడుతుంది.