ఇప్పటికా సరైన చికిత్స లేని కరోనాను అరికట్టాలంటే అనేక దేశాలు టీటీటీ (ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్) అనే విధానాన్నే అమలు చేస్తున్నాయి. కరోనా ఎంత ప్రమాదకరంగా వ్యాప్తి చెందుతుందో తెలిసిన విషయమే. కొంతమందిలో ఎటువంటి లక్షణాలు ఉండవు. కానీ వారి శరీరంలో కరోనా వైరస్ ఉంటుంది. ఇటువంటి వారు వారికి తెలియకుండానే వ్యాధిని వ్యాపింపజేస్తారు. దీంతో ప్రపంచంలోని పలు దేశాలు కరోనాను గుర్తించేందుకు కొత్త ప్రక్రియలను తీసుకొస్తున్నాయి. ఎయిర్పోర్ట్స్, షాపింగ్ మాల్స్లో టెంపరేచర్ చెక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇంకొంచెం విభిన్నంగా యూఏఈ రాజధాని అబుదాబిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కరోనా పేషెంట్స్ను గుర్తంచేందుకు ఫేషియల్ స్కానర్లను ఉపయోగిస్తున్నారు. ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ తరంగాల ద్వారా ఈ యంత్రం కరోనా రోగులను పసిగడుతోంది. మనిషి శరీరంలో కరోనా వైరస్ ఉందా? లేదా? అన్న విషయాన్ని ఈ ప్రక్రియ ద్వారా తెలుసుకుంటున్నారు.
ఒకవేళ ఎవరికైనా కరోనా వైరస్ ఉన్నట్టు తేలితే వారికి వెంటనే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా రద్దీ ప్రదేశాలైన విమానాశ్రయాలు, మాల్స్లో ఫేషియల్ స్కానర్లతో వైరస్ సోకినవారిని గుర్తించేందుకు ఏర్పాట్లు చేసింది. వేల మందిపై జరిపిన పరిశోధనలో దాదాపు 90 శాతానికి పైగా కచ్చితత్వంతో ఇన్ఫెక్షన్ సోకిన వారిని స్కానర్లు గుర్తిస్తున్నాయని అబుదాబి ఆరోగ్యశాఖ తెలిపింది.