కరోనా వైరస్ సోకిందా? లేదా? తెలుసుకోవాలంటే టెస్ట్ చేసుకోవాలి. అయితే ఇక కోవిడ్ 19 టెస్ట్ చేసుకోవడానికి ఎక్కడికీ వెళ్లకుండానే తక్కువ ఖర్చుతో మీరే స్వయంగా టెస్ట్ చేసుకోవచ్చు. కరోనా టెస్టుల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ టెస్టింగ్ సెంటర్ లకు పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టెస్టింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేసే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా టెస్టింగ్ కిట్ ను ప్రజలకు అందుబాటు ధరలో మార్కెట్ లోకి తీసుకొచ్చింది. పేరు కోవిసెల్ఫ్. ఈ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్ ధరను రూ.250గా నిర్ణయించింది. ఈ కిట్ తో 15 నిమిషాల్లో కరోనా సోకిందో లేదో తెలుసుకోవచ్చు. పూణేకు చెందిన మైల్యాబ్ అనే కంపెనీ దేశంలోని తొలి సెల్ఫ్ యూజ్ ర్యాపిడ్ యాంటిజన్ టెస్ట్ కిట్లను అందుబాటులోకి తీసుకువస్తోంది.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ‘ఐసీఎంఆర్’ అనుమతులు వచ్చాయని, అతిత్వరలో ఈ కిట్లను మార్కెట్లోకి తెస్తామని కంపెనీ ప్రకటించింది. ఈ కిట్లను మీ దగ్గరిలోని మెడికల్ స్టోర్లకు వెళ్లి కొనుగోలు చేయొచ్చు. దీనికి డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు. టెస్ట్ చేసుకోవాలని భావిస్తే మెడికల్ షాపుకు వెళ్లి కిట్ కొనుగోలు చేసి నేరుగా టెస్ట్ మీరే చేసుకోవచ్చు. కేవలం 15 నిమిషాల్లోనే కరోనా ఉందా? లేదా? అని తెలిసిపోతుంది. కరోనా టెస్ట్ ప్రక్రియ చాలా సులభతరం కానుంది.