మాస్క్ వల్ల ఆక్సీజన్ సమస్య
ఇందులో నిజం ఎంత ఉంది
మాస్క్ వల్ల ఆక్సీజన్ సమస్య
ఇందులో నిజం ఎంత ఉంది
న్యూఢిల్లీ (నేషనల్ డెస్క్)- కరోనా వైరస్ నుంచి మనల్ని రక్షించేవి మాస్క్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజర్. ఇందులో ప్రధానంగా ఫేస్ మాస్క్ ధరించడం వల్ల చాలా వరకు కరోనా నుంచి రక్షణ పొందవచ్చు. మాస్క్ చాలా వరకు ఎదుటి వారి నుంచి కరోనా సోకకుండా కాపాడుతుంది. అందుకే ప్రస్తుతం మాస్క్ ధరించడం చాలా ముఖ్యం. బయటకు వెళ్లినప్పుడే కాదు.. అవసరమైతే ఇంట్లో కూడా మాస్క్ ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి వైద్య నిపుణులైతే ఒక్కటి కాదు రెండు మాస్కులు ధరించాలని చెబుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇలా ఎక్కువ సేపు మాస్కులు ధరించడం వల్ల ఆక్సిజన్ లోపం ఏర్పడే ప్రమాదం ఉందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. మాస్కులు పెట్టుకోవడం మంచిది కాదనే ప్రచారం జరుగుతోంది. ఎక్కువ సేపు మాస్కు పెట్టుకోవడం వల్ల ఆక్సిజన్ లోపం ఏర్పడుతుందని, ముక్కు నుంచి వదిలిన కార్బన్ డై ఆక్సైడ్ను మళ్లీ పీల్చడం వల్లే ఈ సమస్య వస్తుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. దీంతో కరోనా నుంచి రక్షణనిచ్చే మాస్క్ పెట్టుకోవాలా.. వద్దా అన్న అనుమానం అందరిలో కలుగుతోంది.
ఐతే ఈ ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ పీఐబీ ఖండించింది. మాస్కులు పెట్టుకోవడం వల్ల కాస్త ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగానే ఉండవచ్చు కానీ, దాని వల్ల కార్బన్ డై ఆక్సైడ్ శాతం పెరిగిపోయి.. ఆక్సిజన్ లోపం ఏర్పడుతుందని చెప్పడంలో ఏ మాత్రం నిజం లేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ద్వార తేల్చింది. మాస్కులు ధరించడం వల్ల కరోనా వైరస్ సోకకుండా జాగ్రత్తపడవచ్చిన మరోసారి స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని, ఇలాంటి ఫేక్ సమాచారాన్ని షేర్ చేసుకోవడం ఆపాలని హెచ్చరించింది. ఇతరుల నుంచి కరోనా సోకకుండా ఉండాలంటే ఖచ్చితంగా మాస్కులు ధరించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోను పట్టించుకోకుండా.. తప్పకుండా మాస్కులు ధరించండి. మీకు ఇంకా ఏవైనా అనుమానాలు ఉంటే వైద్యులను సంప్రదించి నిజాలు తెలుసుకొండి.