దేశంలో రోజురోజుకి కరోనా మహమ్మారి కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో 15-18 ఏళ్ల వయస్సు ఉన్నవారికి జనవరి 3 నుండి వాక్సినేషన్ ప్రారంభిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. అదేవిధంగా హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్లతో పాటు 60 ఏళ్లు పైబడిన వారికి మూడో డోస్(బూస్టర్ డోస్) వేయాలని మూడో డోస్ టీకాపై సమావేశమైన నిపుణుల బృందం ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటివరకు మొదటి రెండు డోసులు ఏ విధంగా తీసుకున్నారో.. మూడో డోస్ కూడా అదే ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. కోవిడ్ సెకండ్ డోస్ తీసుకున్న 9 -12 నెలల మధ్యకాలంలో 3వ బూస్టర్ డోస్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. హెల్త్ వర్కర్లు, ఫ్రంట్లైన్ వారియర్లతో పాటు కోమార్బిడిటీస్ ఉన్న వయోవృద్ధులకు 3వ డోస్ను జనవరి 10వ నుంచి ఇవ్వడానికి కేంద్రం కసరత్తులు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. తాజాగా జారీచేసిన ఆదేశాల మేరకు.. 60 ఏళ్లు పైబడినవారు అనారోగ్యంతో బాధపడినట్లయితే జనవరి 10 నుండి బూస్టర్ డోస్ తీసుకోవచ్చు. దేశంలో పెరుగుతున్న ఓమిక్రాన్ వేరియెంట్ కేసులను అదుపు చేసేందుకే జనవరి 10వ నుండి ప్రికాషన్(ముందుజాగ్రత్త) డోసులను పంపిణీ చేయనున్నట్లు ప్రధానమంత్రి స్వయంగా ప్రకటించారు.
ఈ ప్రికాషన్ డోసును ఎలా బుక్ చేసుకోవాలి..? ఏవైనా డాకుమెంట్స్ అవసరమా..?అంటే.. డాక్టర్ సర్టిఫికెట్ ముఖ్యమని తెలుస్తుంది. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజెన్స్ ప్రికాషన్ డోసు తీసుకునేందుకు.. రిజిస్టర్ వైద్యుడి నుండి తీసుకున్న హెల్త్(డాక్టర్) సర్టిఫికెట్ ను స్కాన్ చేసి కొవిన్(CoWIN) పోర్టల్ లో అప్ లోడ్ చేయవచ్చు లేదా వ్యాక్సినేషన్ కేంద్రంలో చూపించాల్సి ఉంటుంది. ప్రికాషన్(బూస్టర్) డోసుకు అర్హులైన వారు వ్యాక్సిన్ పొందేందుకు కొవిన్ పోర్టల్ స్లాట్స్ లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. త్వరలోనే ఈ బుకింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు నేషనల్ హెల్త్, అథారిటీ సీఈవో ఆర్ఎస్ శర్మ తెలిపారు.
బూస్టర్ డోస్ ఎప్పుడు తీసుకోవాలి?తాజా గణాంకాల ప్రకారం.. దేశంలో కనీసం 13.7కోట్ల మంది వయోవృద్ధులు ప్రికాషన్ డోసుకు అర్హులని సమాచారం. మరి 2 డోసులు తీసుకున్న తర్వాత ఎన్ని రోజులకు మూడో డోస్ తీసుకోవాలి? అనే దానిపై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్ టీఏజీఐ) చర్చలు జరుపుతుంది. కానీ రెండో డోసు తీసుకున్నాక దాదాపు 9 – 12 నెలల వ్యవధి తర్వాతే ఈ బూస్టర్ డోస్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
ప్రికాషన్ డోస్ అంటే ఏంటి?ప్రికాషన్ డోస్ అని మూడో డోసునే అంటారు. అయితే.. ఈ మూడో డోసును అనుమతించే ముందు.. మనిషిలో గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, కిడ్నీ(డయాలిసిస్), సిర్రోసిస్, క్యాన్సర్, సికిల్ సెల్ వ్యాధి, స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్, సుదీర్ఘకాల వ్యాధులతో సహా 20 నిర్దిష్ట కొమొర్బిడిటీస్ ల ఆధారంగా అనుమతించే అవకాశం ఉంది. బూస్టర్(మూడో) డోస్కు అర్హులైనవారు సొంతంగా-నమోదు చేసుకునే సమయంలో రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ సంతకం చేసిన కొమొర్బిడిటీ సర్టిఫికేట్ను Co-WIN 2.0 పోర్టల్ లో అప్లోడ్ చేయవచ్చు.. లేదంటే సర్టిఫికెట్ హార్డ్ కాపీని టీకా కేంద్రాలలో సమర్పించవచ్చు.
ప్రస్తుతానికి దేశంలో 61 శాతం జనాభాకు రెండు డోసులు పూర్తయ్యాయి. అలాగే జనాభాలో 90% మందికి మొదటి డోస్ పూర్తయ్యిందని సమాచారం.